AIADMK: అన్నాడీఎంకేకు భారీ దెబ్బ.. టీవీకేలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి అధికార తమిళగ వెట్రి కళగం పార్టీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి విజయ్ నాయకత్వంలోని టీవీకేలో చేరిన ఈ నేతల నిర్ణయం రాష్ట్ర రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
వివరాలు
మంత్రి ఆధవ్ అర్జునను కలిసి, టీవీకే పార్టీలో చేరిన ముగ్గురు నేతలు!
మధురాంతకం ఎమ్మెల్యే మరగతం కుమారవేల్,ధరాపురం ఎమ్మెల్యే సత్యభామ,పెరుందురై ఎమ్మెల్యే జయకుమార్ తమ రాజీనామా పత్రాలను అసెంబ్లీ సభాపతి జేసీడీ ప్రభాకర్కు సమర్పించారు. అనంతరం మంత్రి ఆధవ్ అర్జున్ సమక్షంలో వారు అధికార టీవీకేపార్టీలో చేరారు. ఈ ముగ్గురు నేతలు అన్నాడీఎంకేలో కీలక నేతలైన మాజీ మంత్రులు సీవీ షణ్ముగం,ఎస్పీ వేలుమణి వర్గానికి సన్నిహితులుగా గుర్తింపు పొందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 స్థానాల్లో పోటీ చేసిన టీవీకే 108 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి మెజారిటీ రాకపోవడంతో కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
వివరాలు
అన్నాడీఎంకేలో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయనే చర్చ
అప్పట్లో వేలుమణి వర్గానికి చెందిన పలువురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తారనే ప్రచారం జరిగినా,వారికి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. తాజాగా ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాలతో అన్నాడీఎంకేలో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయనే చర్చ మొదలైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి విజయ్ తిరుచ్చి తూర్పు నియోజకవర్గానికి రాజీనామా చేయగా,ఇప్పుడు ఈ ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాలతో రాష్ట్రంలో ఖాళీ అయిన అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య నాలుగుకు చేరింది. దీంతో త్వరలో జరగబోయే ఉపఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.