
Hyderabad: జీడిమెట్లలో ఘోరం... ప్రియుడితో కలిసి తల్లిని హతమార్చిన బాలిక
ఈ వార్తాకథనం ఏంటి
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. ప్రేమకు అడ్డు చెప్పిందని పదో తరగతి చదువుతున్న కుమార్తె, తన ప్రియుడితో కలిసి కన్నతల్లిని హతమార్చింది. పోలీసుల కథనం ప్రకారం, కొద్ది రోజుల క్రితం విద్యార్థినికి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ యువకుడు పరిచయమయ్యాడు. కొంత కాలం ప్రేమాయణం సాగిన తరువాత బాలిక ఇంటినుంచి వెళ్లిపోయింది. కు మార్తె కనబడకపోవడంతో తల్లి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్న క్రమంలో గత రాత్రి ప్రియుడితో పాటు బాలిక ఇంటికి వచ్చింది.
Details
కర్రతో కొట్టి చంపినట్లు సమాచారం
నిద్రిస్తున్న తల్లి అంజమ్మ గొంతును నులిమి, కర్రతో తలకు కొట్టి చంపినట్టు సమాచారం. ప్రియుడు, అతని తమ్ముడితో కలిసి బాలిక ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం నిందితులు అక్కడినుండి పరారయినట్టు వెల్లడించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలికను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.