Delhi Police: భారత్లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. దావూద్, ఐఎస్ఐ లింకులతో ఉన్న 9 మంది అరెస్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీలో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. దిల్లీ, ముంబయితో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులు నిర్వహించేందుకు ప్రణాళికలు రచించిన తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు దిల్లీ పోలీసులు శనివారం వెల్లడించారు. అధికారుల వివరాల ప్రకారం, అరెస్టైన నిందితులకు పాకిస్థాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)తో పాటు అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితుల్లో దిల్లీ, ముంబయి, పంజాబ్కు చెందిన వ్యక్తులతో పాటు కొందరు విదేశీయులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.
వివరాలు
మరిన్ని వివరాల కోసం విచారణ
వారి వద్ద నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. భారత్లో విధ్వంసక చర్యలు చేపట్టేలా ఈ ఉగ్ర మాడ్యూల్కు ఐఎస్ఐ ప్రత్యేక శిక్షణ అందించినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. కీలక ప్రభుత్వ భవనాలు, వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలు, భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించడమే ఈ మాడ్యూల్కు అప్పగించిన ప్రధాన బాధ్యతగా దర్యాప్తులో వెల్లడైనట్లు అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.