LOADING...
Wipro: విప్రోలో మత మార్పిడి ఒత్తిళ్లు?.. మాజీ ఉద్యోగిని సంచలన ఆరోపణలు
విప్రోలో మత మార్పిడి ఒత్తిళ్లు?.. మాజీ ఉద్యోగిని సంచలన ఆరోపణలు

Wipro: విప్రోలో మత మార్పిడి ఒత్తిళ్లు?.. మాజీ ఉద్యోగిని సంచలన ఆరోపణలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 04, 2026
04:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

పుణేలోని విప్రో సంస్థలో పనిచేసిన ఓ మాజీ ఉద్యోగిని కార్యాలయంలో మానసిక వేధింపులు, మత మార్పిడి ఒత్తిళ్లు ఎదుర్కొన్నట్లు ఆరోపించారు. హింజేవాడి కార్యాలయంలో పనిచేసిన సమయంలో తన సహోద్యోగి ఇస్లాం మతంలోకి మారాలని,ఓ ముస్లిం వ్యక్తితో సంబంధం ఏర్పరచుకోవాలని ఒత్తిడి తెచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై హింజేవాడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు విప్రో టెక్నాలజీస్‌కు లీగల్ నోటీసు కూడా పంపించారు. మతపరమైన వేధింపులు, కార్యాలయ వివక్ష,బలవంతపు రాజీనామా వంటి అంశాలను ఆమె తన ఫిర్యాదులో ప్రస్తావించారు. మాజీ ఉద్యోగిని తెలిపిన వివరాల ప్రకారం,ఆమెతో కలిసి పనిచేసిన ఓ మహిళా సహోద్యోగి వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకుంటూ హిందూ మతాన్ని విడిచిపెడితే మెరుగైన జీవితం,విదేశీ అవకాశాలు లభిస్తాయని తరచూ చెప్పేదని ఆరోపించారు.

వివరాలు 

సంస్థ అంతర్గత ఒంబుడ్స్ కమిటీకి ఫిర్యాదు

మత మార్పిడి చేసుకుంటే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని,జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తనపై ఒత్తిడి తీసుకొచ్చిందని ఆమె వెల్లడించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన మాజీ ఉద్యోగిని,ఉద్యోగంలో చేరిన తొలి రోజు నుంచే తనను వేధించడం ప్రారంభించారని ఆరోపించారు. కంపెనీ కంట్రీ హెడ్‌తో సన్నిహిత సంబంధం పెంచుకుంటే దుబాయ్‌కు బదిలీ చేయించవచ్చని, అక్కడ ఓషేక్‌తో వివాహం జరిపిస్తామని,తద్వారా ఆర్థికంగా లాభపడతావని చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ విషయాన్ని సంస్థ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా తనపైనే సంస్థ అంతర్గత ఒంబుడ్స్ కమిటీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అనంతరం 2025 ఆగస్టులో మైక్రోసాఫ్ట్ టీమ్స్ సమావేశం సందర్భంగా తన అభిప్రాయం చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా బలవంతంగా రాజీనామా చేయించారని ఆరోపించారు.

వివరాలు 

అధికారికంగా క్షమాపణ చెప్పాలి 

మాజీ ఉద్యోగిని తరఫున వాదిస్తున్న న్యాయవాది వివేక్ భోసలే మాట్లాడుతూ, ఒత్తిడి మధ్య తీసుకున్న రాజీనామా కార్మిక చట్టాలు, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగంలో తిరిగి నియమించడం, రాజీనామాను రద్దు చేయడం, మానసిక వేదన, పరువు నష్టం కారణంగా రూ.50 లక్షల పరిహారం చెల్లించడం, అలాగే బాధ్యులపై చర్యలు తీసుకుంటూ అధికారికంగా క్షమాపణ చెప్పాలని లీగల్ నోటీసులో డిమాండ్ చేశారు.

Advertisement