Almatti: ఆలమట్టిలోకి 1,31,940 క్యూసెక్కులు.. నాలుగు రోజుల్లో మరింత తగ్గే అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటకలోని ఆలమట్టి జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతున్నప్పటికీ, రానున్న రోజుల్లో గణనీయంగా తగ్గే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదివారం ఒక్కరోజే సుమారు 12 టీఎంసీల నీరు జలాశయానికి చేరింది. ప్రస్తుతం ఆలమట్టికి 1,31,940 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతుండగా,దిగువకు కేవలం 483 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు. ఆలమట్టి జలాశయం మొత్తం నిల్వ సామర్థ్యం 123 టీఎంసీలు కాగా,ప్రస్తుతం 86.061 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. మహారాష్ట్రలో వర్షాల తీవ్రత తగ్గడంతో కృష్ణా నదిలో వరద క్రమంగా తగ్గుముఖం పట్టింది. దీంతో ఆలమట్టికి వచ్చే ప్రవాహం కూడా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.
వివరాలు
తుంగభద్ర జలాశయంలో 22.948 టీఎంసీల నీరు
సోమవారం నాటికి ఇన్ఫ్లో 64,700 క్యూసెక్కులకు తగ్గే అవకాశం ఉండగా, జూలై 17 నాటికి అది 8,850 క్యూసెక్కులకు పరిమితమవుతుందని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో తుంగభద్ర జలాశయానికి వచ్చే వరద కూడా తగ్గుతోంది. శనివారం 38,977 క్యూసెక్కులుగా నమోదైన ఇన్ఫ్లో ఆదివారం నాటికి 25,120 క్యూసెక్కులకు పడిపోయింది. తుంగభద్ర జలాశయం మొత్తం నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 22.948 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఆలమట్టి దిగువనున్న నారాయణపూర్, జూరాల జలాశయాల నుంచి గణనీయమైన ప్రవాహం లేకపోవడంతో శ్రీశైలం జలాశయానికి ప్రస్తుతం నీటి రాక పూర్తిగా నిలిచిపోయింది. నాగార్జునసాగర్ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. ప్రస్తుతం నాగార్జునసాగర్లో 138.03 టీఎంసీల నీరు నిల్వగా ఉంది.
వివరాలు
గోదావరికి తగ్గిన వరద
పులిచింతల ప్రాజెక్టులో ఆదివారం నాటికి 30.99 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు ఏఈ రాజు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి అక్కడికీ నీటి ప్రవాహం నిలిచిపోయినట్లు వెల్లడించారు. గోదావరి నదిలో కూడా వరద క్రమంగా తగ్గుతోంది. రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి ఆదివారం 47,842 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ఈ నెల 8వ తేదీ నుంచి గోదావరిలో వరద ప్రవాహం ప్రారంభమైంది. అనంతరం మరుసటి రోజు గరిష్ఠంగా 1,15,480 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రవాహం తగ్గడంతో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటోంది.
వివరాలు
ఎర్రటి వర్ణంలో కనిపించిన కృష్ణానది
పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా తరలించిన గోదావరి వరద జలాలు పోలవరం కుడి కాలువ గుండా శనివారం రాత్రి కృష్ణానదిలో కలిశాయి. దీంతో ఆదివారం ఉదయానికి అప్పటి వరకు నీలం రంగులో కనిపించిన కృష్ణా జలాలు ఎర్రటి వర్ణాన్ని సంతరించుకున్నాయి. ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వద్ద ఒకవైపు నీలం రంగు నీరు,మరోవైపు ఎర్రటి వర్ణంలో వచ్చిన గోదావరి జలాలు కలిసిన దృశ్యం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ అరుదైన ప్రకృతి దృశ్యాన్ని తిలకించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం పట్టిసీమ ఎత్తిపోతల పథకంలోని 20పంపుల ద్వారా 7,080 క్యూసెక్కుల గోదావరి జలాలను కృష్ణానదిలోకి తరలిస్తున్నారు. ఈ నీటిని అనంతరం కృష్ణా డెల్టా ప్రాంతాలకు సాగునీటి అవసరాల కోసం విడుదల చేస్తున్నారు.