LOADING...
Andhra Pradesh: ఏపీలోని ఇళ్లు, ఫ్లాట్లు, ఖాళీ స్థలాలకు త్వరలో ప్రాపర్టీ కార్డులు
ఏపీలోని ఇళ్లు, ఫ్లాట్లు, ఖాళీ స్థలాలకు త్వరలో ప్రాపర్టీ కార్డులు

Andhra Pradesh: ఏపీలోని ఇళ్లు, ఫ్లాట్లు, ఖాళీ స్థలాలకు త్వరలో ప్రాపర్టీ కార్డులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 13, 2026
08:31 am

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్రలో అమల్లో ఉన్న విధానాన్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలోని నగరాలు,పట్టణాల్లో ఉన్న ఇళ్లు,ఫ్లాట్లు,దుకాణాలు,వాణిజ్య భవనాలు,ఖాళీ స్థలాలకు ప్రాపర్టీ కార్డులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నక్ష (NAKSHA)ప్రాజెక్టులో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ముందుగా తాడేపల్లిగూడెం,రేపల్లె పురపాలక సంఘాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసి,అనంతరం దశలవారీగా మిగిలిన నగరాలు, పట్టణాలకు విస్తరించనున్నారు. ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ అంశంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా తాడేపల్లిగూడెంలో 30 వేల,రేపల్లెలో మరో 30 వేల చొప్పున మొత్తం 60 వేల ప్రాపర్టీ కార్డుల కోసం వచ్చే నెలాఖరులోగా సర్వే పూర్తి చేసి కార్డులు జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

వివరాలు 

మహారాష్ట్ర తరహాలో అమలు

మహారాష్ట్రలోని ముంబయి, పుణె, ఠాణె వంటి నగరాల్లో ఇప్పటికే బహుళ అంతస్తుల భవనాల్లోని ఫ్లాట్లు, వాణిజ్య భవనాలకు ప్రాపర్టీ కార్డులు జారీ చేస్తున్నారు. అదే తరహాలో రాష్ట్రంలో కూడా అపార్ట్‌మెంట్లు, బహుళ అంతస్తుల భవనాలు, వ్యక్తిగత ఇళ్లు, వాణిజ్య సముదాయాలు, దుకాణాలు, ఖాళీ స్థలాలు సహా అన్ని పట్టణ ఆస్తులకు ప్రాపర్టీ కార్డులు అందించనున్నారు.

వివరాలు 

ప్రాపర్టీ కార్డులో ఉండే వివరాలు

ప్రతి ప్రాపర్టీ కార్డులో ఆస్తికి సంబంధించిన సమగ్ర సమాచారం నమోదు చేస్తారు. వాటిలో.. యజమాని పేరు ఫ్లాట్ లేదా ఆస్తి నంబర్ కార్పెట్ ఏరియా, బిల్ట్-అప్ ఏరియా అపార్ట్‌మెంట్ లేదా బహుళ అంతస్తుల భవనంలోని ఫ్లాట్‌కు సంబంధించిన భూమి వాటా బ్యాంకు రుణాలు, తనఖా వివరాలు వార్షిక ఆస్తిపన్ను సమాచారం ఖాళీ స్థలమైతే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వివరాలు

Advertisement

వివరాలు 

ప్రాపర్టీ కార్డులతో కలిగే ప్రయోజనాలు

ఈ విధానం ద్వారా ఆస్తి యాజమాన్యానికి మరింత స్పష్టత ఏర్పడనుంది. ముఖ్యంగా.. ఫ్లాట్‌కు సంబంధించిన కార్పెట్ ఏరియా, బిల్ట్-అప్ ఏరియా, భూమిలో వాటాపై స్పష్టమైన సమాచారం లభిస్తుంది. ఆస్తుల కొనుగోలు, విక్రయాల ప్రక్రియ మరింత సులభమవుతుంది. బ్యాంకుల నుంచి రుణాలు త్వరగా పొందే అవకాశం ఉంటుంది. యాజమాన్య వివాదాలు తగ్గే అవకాశముంది. ఆస్తి వివరాలు ఒకే కార్డులో అందుబాటులో ఉండడంతో పారదర్శకత పెరుగుతుంది.

Advertisement

వివరాలు 

డ్రోన్లతో సర్వే.. జియో కోఆర్డినేట్స్‌తో కార్డులు

నగరాలు, పట్టణాల్లో డ్రోన్ల ద్వారా చిత్రాలు సేకరించి క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహిస్తారు. ఫ్లాట్లు, వ్యక్తిగత ఇళ్లు, దుకాణాలకు సంబంధించిన ఆస్తిపన్ను వివరాలు, ఖాళీ స్థలాల పన్ను సమాచారం, జియో కోఆర్డినేట్స్‌ను అనుసంధానించి డిజిటల్ ప్రాపర్టీ కార్డులు రూపొందిస్తారు. ఈ ప్రక్రియలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను కూడా భాగస్వామ్యం చేస్తారు. ప్రాపర్టీ కార్డులో నమోదైన వివరాల ఆధారంగా సబ్-రిజిస్ట్రార్లు ఆస్తుల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్ పూర్తికాగానే యాజమాన్య బదలాయింపుకు సంబంధించిన మ్యుటేషన్ ప్రక్రియ కూడా వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటారు.

వివరాలు 

అక్రమ నిర్మాణాలు వెంటనే గుర్తింపు

ప్రాపర్టీ కార్డుల ద్వారా అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలను సులభంగా గుర్తించవచ్చు. ఫ్లాట్ లేదా వ్యక్తిగత ఇంటి నిర్మాణానికి పట్టణ ప్రణాళిక విభాగం అనుమతి ఉందా లేదా అనే వివరాలు కార్డులో నమోదు చేస్తారు. అలాగే సంబంధిత భవనం వాణిజ్య, నివాస, వ్యవసాయ లేదా పరిశ్రమ జోన్‌లో ఏ విభాగానికి చెందినదో కూడా స్పష్టంగా తెలుస్తుంది. దీంతో ఇళ్లు లేదా ఫ్లాట్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఆయా ఆస్తుల చట్టబద్ధత, పూర్తి వివరాలు ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంటుంది.

వివరాలు 

రాష్ట్రంలో పట్టణ ఆస్తుల వివరాలు

రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం 123 పురపాలక సంస్థలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలు ఉన్నాయి. మొత్తం నిర్మాణాలు : 50 లక్షలు ఇళ్లు : 40 లక్షలు వాణిజ్య భవనాలు : 10 లక్షలు ఖాళీ స్థలాలు : 2.31 లక్షలు

Advertisement