LOADING...
Bharatpol: సీబీఐ సహకారంతో 'భారత్‌పోల్‌' పోర్టల్.. అంతర్జాతీయ కేసుల విచారణలో కీలక అడుగు
సీబీఐ సహకారంతో 'భారత్‌పోల్‌' పోర్టల్.. అంతర్జాతీయ కేసుల విచారణలో కీలక అడుగు

Bharatpol: సీబీఐ సహకారంతో 'భారత్‌పోల్‌' పోర్టల్.. అంతర్జాతీయ కేసుల విచారణలో కీలక అడుగు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 07, 2025
01:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేసుల వేగవంతమైన విచారణ కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త పద్ధతులను ప్రవేశపెట్టింది. మంగళవారం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా భారత్‌పోల్‌ అనే నూతన పోర్టల్‌ను ప్రారంభించారు. అంతర్జాతీయ నేరాలను ఎదుర్కొనే విషయంలో ఇది కొత్త శకానికి నాంది పలుకుతుందని ఆయన పేర్కొన్నారు. భారత్‌పోల్‌ వ్యవస్థకు సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌) సహకారంతో రూపకల్పన జరిగింది. ఈ పోర్టల్‌ దర్యాప్తు సంస్థలకు అంతర్జాతీయ స్థాయిలో పోలీసు వ్యవస్థలతో సులభంగా అనుసంధానం అయ్యే అవకాశాన్ని కల్పిస్తుంది. పరారీలో ఉన్న నేరగాళ్లను అదుపులోకి తీసుకోవడానికి, ఇంటర్‌పోల్ సహకారాన్ని వేగంగా పొందడానికి దర్యాప్తు సంస్థలకు ఇది ముఖ్యమైన సాధనంగా మారనుంది.

Details

న్యాయవ్యవస్థను ఆధునికీకరించాల్సిన అవసరం ఉంది

ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న నేర సంబంధిత సవాళ్లను దృష్టిలో ఉంచుకుని మన న్యాయవ్యవస్థను ఆధునికీకరించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా అమిత్‌ షా ప్రస్తావించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన దర్యాప్తు సంస్థలు ఇంటర్‌పోల్‌తో సులువుగా కనెక్ట్ అవ్వడం ఇప్పుడు సాకారం కానుందన్నారు. భారత్‌పోల్‌ అనేది ఈ దిశగా కీలకమైన అడుగు అని ఆయన వివరించారు. భారత్‌పోల్‌ ప్రారంభం సందర్భంగా, సీబీఐను మూడు ముఖ్యమైన నేర చట్టాలపై రాష్ట్ర ప్రభుత్వాల దర్యాప్తు సంస్థలకు శిక్షణ ఇవ్వాల్సిందిగా అమిత్‌షా కోరారు. ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి నేరగాళ్లను పసిగట్టడంలో ఈ శిక్షణ కీలకంగా ఉంటుందని పేర్కొన్నారు. భారత్‌పోల్‌తో పాటు, నేరాలపై సమగ్ర వ్యవస్థలను మెరుగుపరిచే చర్యలకు ఇది ప్రేరణగా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.