Tirumala Temple : తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. ఆరోజు 10గంటలపాటు శ్రీవారి ఆలయం మూసివేత
ఈ వార్తాకథనం ఏంటి
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు ప్రతిరోజూ భారీ సంఖ్యలో తిరుమలకు వెళ్తుంటారు . తెలుగు రాష్ట్రాల ప్రజలతోపాటు దేశ, విదేశాల నుంచి శ్రీవారి భక్తులు తిరుమల (Tirumala Temple) కు వెళ్లి స్వామివారిని దర్శించుకుంటుంటారు. భక్తులకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడటానికి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పటిష్టమైన ఏర్పాట్లు చేస్తుంది. భక్తులు వీలైనంత త్వరగా స్వామివారి దర్శనం పొందేలా, అన్ని అవసరమైన చర్యలు టీటీడీ తీసుకుంటుంది. తిరుమల చేరే భక్తుల కోసం టీటీడీ ముఖ్య సూచనలు జారీ చేసింది. తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. మార్చి 3వ తేదీన శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు తెలిపింది.
వివరాలు
3వ తేదీ చంద్రగ్రహణం
మార్చి3వ తేదీన ఉదయం 9గంటల నుంచి రాత్రి 7.30గంటల వరకు ఆలయ తలుపులు మూసివేయడం జరుగుతుందని, కావున ఈ విషయాన్ని భక్తులు గమనించి యాత్ర ప్రణాళికను రూపొందించుకోవాలని టీటీడీ తెలిపింది. చంద్రగ్రహణం 3వ తేదీ సాయంత్రం 3.20గంటల నుంచి 6.47గంటల వరకు కొనసాగుతుంది. గ్రహణానికి సుమారు 6గంటలు ముందుగా ఏర్పాట్లు ప్రారంభమవుతాయి. అందువల్ల, మార్చి 3వ తేదీ ఉదయం 9గంటల నుంచి తిరుమల శ్రీవారి ఆలయం మూసివేస్తారు. దాదాపు 10.30 గంటలపాటు ఆలయం మూసివేసి ఉంటుంది. ఆలయం తలుపులు 3వ తేదీ రాత్రి 7.30గంటలకు తిరిగి తెరవబడతాయి.
వివరాలు
తిరుమల యాత్రకు ప్రణాళిక
తదుపరి శుద్ధి, పుణ్యహవచనం పూర్తి చేసిన తర్వాత రాత్రి 8.30గంటల నుంచి భక్తుల దర్శనం పునఃప్రారంభం అవుతుంది. చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీకి నిగ్రహించిన అష్టదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి తమ తిరుమల యాత్రకు ప్రణాళికను రూపొందించుకోవాలని టీటీడీ సూచించింది.