Shahzad Bhatti: షహజాద్ భట్టీ నెట్వర్క్ నిషేధిత ఉగ్రసంస్థ.. అమిత్ షా ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న షహజాద్ భట్టీ నెట్వర్క్ (SBN)ను కేంద్ర ప్రభుత్వం నిషేధిత ఉగ్రసంస్థగా ప్రకటించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద ఈ చర్య తీసుకుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ విషయాన్ని వెల్లడించారు. ''ఈ నెట్వర్క్ సరిహద్దుల గుండా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాలను అక్రమంగా తరలిస్తోంది. యువత, నేరస్థులను ఉగ్రవాదం వైపు ప్రేరేపిస్తోంది. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, మత సామరస్యాన్ని లక్ష్యంగా చేసుకుని విద్వేషపూరిత డిజిటల్ కంటెంట్ను వ్యాప్తి చేస్తోంది'' అని అమిత్ షా తెలిపారు.
వివరాలు
భారత్లో బాంబు దాడులు, హత్యల వెనుక..
ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. షహజాద్ భట్టీ నెట్వర్క్ పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ.
భారత్లో జరిగిన పలు బాంబు దాడులు, హత్యల వెనుక ఈ సంస్థ హస్తం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
పోలీస్, రక్షణ సంస్థలు, మతపరమైన ప్రదేశాలపై రెక్కీ నిర్వహించేందుకు స్థానిక మధ్యవర్తులను వినియోగిస్తున్నట్లు తెలిపారు.
గూఢచర్యం కోసం సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి వారికి డబ్బు చెల్లిస్తున్నట్లు వివరించారు.
భారత్లోని దిల్లీ, పంజాబ్, ఉత్తర్ప్రదేశ్, రాజస్థాన్, హరియాణా, ఉత్తరాఖండ్లో షహజాద్ భట్టీపై కేసులు నమోదయ్యాయి.
భారత్ నిషేధించిన ఉగ్రసంస్థల జాబితాలో ఎస్బీఎన్ 46వ సంస్థగా చేరింది.
వివరాలు
దోపిడీలతో నేర ప్రపంచంలోకి..
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్కు చెందిన షహజాద్ భట్టీ.. దోపిడీల ద్వారా నేర ప్రపంచంలోకి అడుగుపెట్టాడు.
అనంతరం పాకిస్థాన్ నుంచి యూఏఈకి మకాం మార్చినట్లు ప్రభుత్వ వివరాలు పేర్కొంటున్నాయి.