CM Revanth Reddy: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉత్సవాల తొలిరోజు సీఎం రేవంత్ రెడ్డి దంపతులతో పాటు మంత్రులు స్వామి వారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా యాదగిరిగుట్టకు రాగా.. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం రేవంత్ రెడ్డి దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పూజల తర్వాత పండితులు వేదాశీర్వచనం అందించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు కూడా పూజల్లో పాల్గొన్నారు.
భద్రాచలంలో శ్రీరాముడి దర్శనం
సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రిలో పూజల అనంతరం భద్రాచలం వెళ్లనున్నారు. అక్కడ శ్రీసీతారామ చంద్ర స్వామివారిని దర్శించుకోనున్నారు. రేవంత్ రెడ్డి ఒకేరోజున తెలంగాణలోని రెండు ప్రసిద్ధ ఆలయాలను దర్శించుకోవడం గమనార్హం. యాదగిరి గుట్ట నుంచి సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా సారపాకకు చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలం వెళ్తారు. ఆ తర్వాత శ్రీసీతారామ చంద్ర స్వామివారిని దర్శించుకుంటారు. భద్రాచలంలో శ్రీరాముడిని దర్శించుకున్న తర్వాత మార్కెట్ యార్డులో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఆ తర్వాత మణుగూరు ఐటీఐ కాలేజీలో జరిగే ప్రజా దీవెన సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు.