Lashkar Terrorist: దిల్లీ ఉగ్ర ముఠా వెనుక బంగ్లాదేశ్ హ్యాండ్లర్ పాత్ర
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీలో ఆదివారం ఛేదించిన లష్కరే తొయిబా అనుబంధ ఉగ్ర ముఠా కార్యకలాపాల వెనుక బంగ్లాదేశ్కు చెందిన ఓ హ్యాండ్లర్ కీలక పాత్ర పోషించినట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. శిక్షణ పొందిన ఉగ్రవాది షబీర్ అహ్మద్ లోన్ ఈ నెట్వర్క్ను బంగ్లాదేశ్ నుంచే సమన్వయం చేసినట్టు సమాచారం. అతడు తరచూ దిల్లీతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు వచ్చి, బంగ్లాదేశ్ పౌరులను ఈ ముఠాలో చేర్చుకున్నట్లు నిఘా వర్గాలను ఉటంకిస్తూ ఒక ఆంగ్ల మీడియా సంస్థ వెల్లడించింది. షబీర్ ఇటీవల దిల్లీలోని షాహిన్బాగ్ ప్రాంతాన్ని సందర్శించినట్లు సమాచారం అందింది. దీంతో అతడికి తోడ్పాటునిచ్చిన స్థానిక నెట్వర్క్ను గుర్తించేందుకు స్పెషల్ సెల్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు.
వివరాలు
బుర్హాన్ వనీ పోస్టర్ల వెనుక ముఠా గుట్టు రట్టు
ఈ కేసులో భాగంగా ముఠాకు చెందిన ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు ఆదివారం అధికారులు వెల్లడించారు. ఈ ఆపరేషన్లో పశ్చిమబెంగాల్, తమిళనాడు దర్యాప్తు బృందాలు కూడా సహకరించాయి. దిల్లీలో పాకిస్తాన్కు మద్దతుగా, ఉగ్రవాదానికి అనుకూలంగా బుర్హాన్ వనీ పోస్టర్లు ప్రదర్శించిన ఘటనల వెనుక ఈ ముఠా ప్రమేయం ఉన్నట్లు తేలింది. ఫిబ్రవరి 8న జనపథ్ మెట్రో స్టేషన్లో పాక్, ఉగ్రవాద అనుకూల పోస్టర్లు కనిపించడంతో మొదట ఫిర్యాదు నమోదు అయ్యింది. అనంతరం ఇలాంటి పోస్టర్లు నగరంలోని పలు ప్రాంతాల్లో వెలుగులోకి రావడంతో విచారణ బృందాలు అప్రమత్తమయ్యాయి. దర్యాప్తు పురోగమిస్తూ పశ్చిమబెంగాల్లోని మాల్దా ప్రాంతానికి చెందిన ఉమర్ ఫరూక్, బంగ్లాదేశ్ వాసి రోబియుల్ ఇస్లాంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వివరాలు
కోల్కతా నుంచి దిల్లీకి చేరుకుని ఉగ్ర పోస్టర్ల కుట్ర
ఫరూక్ గత ఏడాది మార్చిలో లోన్ను కలిసినట్లు సమాచారం. ఆ తర్వాత అతనికి ఉగ్ర భావజాలాన్ని నూరిపోసి, భారత్లో తన కార్యకలాపాలకు సహకరించేలా ప్రేరేపించినట్టు వెల్లడైంది. ఫిబ్రవరి 6న ఫరూక్, ఇస్లాం కలిసి కోల్కతా నుంచి పట్నా మార్గంగా విమానంలో దిల్లీకి చేరుకున్నారు. తదుపరి రోజే నగరంలోని పది ప్రదేశాల్లో ఉగ్రవాద అనుకూల పోస్టర్లు అంటించారు. తమ చర్యలను వీడియోగా చిత్రీకరించి ఆ దృశ్యాలను లోన్కు పంపిన అనంతరం వారు తిరిగి కోల్కతాకు వెళ్లినట్లు దర్యాప్తులో బయటపడింది.