Page Loader
Tg Ssc Exams 2025 : మార్చి 21 నుంచి టెన్త్‌ పరీక్షలు! నిమిషం నిబంధన అమల్లో ఉంటుందా?
మార్చి 21 నుంచి టెన్త్‌ పరీక్షలు! నిమిషం నిబంధన అమల్లో ఉంటుందా?

Tg Ssc Exams 2025 : మార్చి 21 నుంచి టెన్త్‌ పరీక్షలు! నిమిషం నిబంధన అమల్లో ఉంటుందా?

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 18, 2025
11:48 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షా కేంద్రాల ఏర్పాటు,వసతుల కల్పన తదితర ఏర్పాట్లపై విద్యాశాఖ అధికారులు పూర్తి దృష్టి సారించారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో డీఈవోలు పరీక్షా కేంద్రాలను గుర్తించి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫిబ్రవరిలోనే కలెక్టర్లు ఈ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. పరీక్షల నిర్వహణ కోసం చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, కస్టోడియన్లు, ఇన్విజిలేటర్లను నియమించడంతో పాటు ప్రతి పరీక్షా కేంద్రానికి ఇద్దరు ఏఎన్‌ఎంలు, ఒక పోలీసు అధికారి, ఇద్దరు అటెండర్లను ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు విద్యా, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులతో ఏర్పాటు చేయగా, సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయనున్నాయి.

వివరాలు 

సీసీ కెమెరాల పర్యవేక్షణలో.. ప్రశ్నపత్రాలు తెరవాలి  

కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు పరీక్షల నిర్వహణ సరళిని స్వయంగా తనిఖీ చేయనున్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో చీఫ్‌ సూపరింటెండెంట్‌ గదిలో నిఘానేత్రాలను (సీసీ కెమెరాలు) ఏర్పాటు చేశారు. పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందే ప్రశ్నపత్రాల కట్టలను సీసీ కెమెరాల పర్యవేక్షణలో తెరవాల్సి ఉంటుంది. సీసీ కెమెరాలు లేని కేంద్రాల్లో వీటిని వెంటనే అమర్చాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. పరీక్షలకు సంబంధించిన ఏదైనా ఇబ్బంది వస్తే లేదా ఫిర్యాదు చేయాలంటే కంట్రోల్‌ రూమ్‌ నెంబర్లకు ఫోన్‌ చేయాలి. కొన్నిచోట్ల ప్రైవేట్ స్కూళ్లు ఫీజు చెల్లించాల్సిందేనని విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయని, దీనిపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.

వివరాలు 

8:30 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతి..

డీఈవో కార్యాలయాల నుంచి ప్రతీ పాఠశాలకు హాల్‌టికెట్లు పంపిణీ చేయగా, bse.telangana.gov.in వెబ్‌సైట్‌ నుంచి విద్యార్థులు స్వయంగా హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్ష రాయవచ్చు. డౌన్‌లోడ్‌ చేసిన హాల్‌టికెట్‌పై ప్రిన్సిపాల్‌ సంతకం అవసరం లేదని వెల్లడించారు. పదో తరగతి పరీక్షలకు నిమిష నిబంధన ఏదీ లేకపోయినా ఆలస్యంగా రావొద్దని, విద్యార్థులు కనీసం అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. కేంద్రాన్ని ఒకరోజు ముందే చూసుకోవడం మంచిదని, ఉదయం 8:30 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు.