EC: ఏపీ సహా 10 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలోని పది రాష్ట్రాలకు చెందిన రాజ్యసభ స్థానాల ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. అలాగే మూడు రాష్ట్రాల్లోని శాసన మండలి స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ ఎన్నికల పోలింగ్ను జూన్ 18న నిర్వహించనున్నట్టు ఈసీ స్పష్టం చేసింది. జూన్, జులై నెలల్లో మొత్తం 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఆయా స్థానాల భర్తీ కోసం ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. ఇందుకోసం పది రాష్ట్రాల్లోని రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ను విడుదల చేసింది.
వివరాలు
జూన్ 20 నాటికి పూర్తికానున్న ఎన్నికల ప్రక్రియ
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నేటి నుంచి జూన్ 8 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. జూన్ 9న నామినేషన్ పత్రాల పరిశీలన చేపట్టనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 11ను చివరి తేదీగా నిర్ణయించింది. జూన్ 18న పోలింగ్ నిర్వహించనుండగా, అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎన్నికల మొత్తం ప్రక్రియ జూన్ 20 నాటికి పూర్తికానుంది. ఇదే సమయంలో బిహార్లోని తొమ్మిది రాష్ట్ర శాసన మండలి స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అదనంగా ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక కూడా జరగనున్నట్లు ఈసీ వెల్లడించింది.