Ethanol-blended diesel: డీజిల్లో ఇథనాల్ మిశ్రమానికి కేంద్రం బ్రేక్.. అసలు కారణం ఇదే..
ఈ వార్తాకథనం ఏంటి
పెట్రోల్లో ఇథనాల్ కలపడం, E20 ఇంధనంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో డీజిల్లోనూ ఇథనాల్ మిశ్రమంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి డీజిల్లో ఇథనాల్ కలపాలన్న ప్రతిపాదనను పక్కన పెట్టినట్లు కేంద్రం వెల్లడించింది. ఇథనాల్ను డీజిల్లో కలపడం వల్ల దాని ఫ్లాష్ పాయింట్ గణనీయంగా తగ్గుతున్నట్లు నిర్వహించిన పరీక్షల్లో తేలడమే ఇందుకు ప్రధాన కారణమని స్పష్టం చేసింది.
వివరాలు
పరీక్షల్లో కీలక విషయాలు
పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి ఈ విషయాన్ని రాజ్యసభలో వెల్లడించారు.
ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తమ పరిశోధన, అభివృద్ధి కేంద్రాల ఆధ్వర్యంలో ఇథనాల్-డీజిల్ మిశ్రమంపై పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.
ఈ ప్రక్రియలో గుర్తింపు పొందిన ప్రయోగశాలలు, ఆటోమొబైల్ కంపెనీలు, ఇతర సాంకేతిక సంస్థలు కూడా పాల్గొన్నాయని చెప్పారు.
డీజిల్లో ఇథనాల్ కలిపినప్పుడు ఇంధనం ఫ్లాష్ పాయింట్ గణనీయంగా పడిపోతున్నట్లు పరీక్షల్లో గుర్తించారు.
ఇథనాల్ మిశ్రమంతో తయారైన డీజిల్.. నిర్దేశించిన ఫ్లాష్ పాయింట్ ప్రమాణాలను అందుకోలేకపోయినట్లు కేంద్రం తెలిపింది.
దీంతో డీజిల్లో ఇథనాల్ కలిపే ప్రణాళికను ప్రస్తుతానికి నిలిపివేయాలని నిర్ణయించింది.
వివరాలు
ఫ్లాష్ పాయింట్ అంటే ఏమిటి?
డీజిల్ నిల్వ,రవాణా,నిర్వహణలో భద్రత అత్యంత ముఖ్యమైన అంశం. ఫ్లాష్ పాయింట్ తగ్గితే బయట నుంచి మంట,నిప్పురవ్వ వంటి ఇగ్నిషన్ సోర్స్ తగిలినప్పుడు ఇంధనం నుంచి వచ్చే ఆవిరి మండే అవకాశం పెరుగుతుంది.
ఈ భద్రతా అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే డీజిల్లో ఇథనాల్ మిశ్రమాన్ని వద్దని కేంద్రం నిర్ణయించింది.
ఫ్లాష్ పాయింట్ అనేది ఇంధనం భద్రతను అంచనా వేయడానికి ఉపయోగించే ముఖ్యమైన ప్రమాణం.
ఒక ఇంధనం నుంచి విడుదలయ్యే ఆవిరి గాలితో కలిసి,బయట నుంచి మంట లేదా నిప్పురవ్వ తగిలినప్పుడు క్షణికంగా మండే అవకాశం ఏర్పడే అత్యల్ప ఉష్ణోగ్రతను ఫ్లాష్ పాయింట్ అంటారు.
అయితే ఫ్లాష్ పాయింట్ తక్కువగా ఉందంటే ఆ ఉష్ణోగ్రత వద్ద ఇంధనం తనంతట తానే మండిపోతుందని అర్థం కాదు.
వివరాలు
E20 తర్వాత ఏంటి?
సాధారణంగా మంట లేదా నిప్పురవ్వ వంటి బాహ్య ఇగ్నిషన్ సోర్స్ అవసరం ఉంటుంది.
అయినప్పటికీ నిల్వ కేంద్రాలు, ఇంధన ట్యాంకర్లు, పెట్రోల్ బంకుల్లోని నిల్వ వ్యవస్థల విషయంలో ఫ్లాష్ పాయింట్ భద్రత పరంగా చాలా కీలకంగా ఉంటుంది.
డీజిల్లో ఇథనాల్ మిశ్రమ ప్రతిపాదన నిలిచిపోవడంతో పెట్రోల్లో ఇథనాల్ శాతం పెంపుపైనా చర్చ కొనసాగుతోంది.
అయితే ప్రస్తుతం E20.. అంటే 20 శాతం ఇథనాల్ కలిగిన పెట్రోల్ను మించి వెళ్లే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
భవిష్యత్తులో పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని 20 శాతానికి పైగా పెంచాలని నిర్ణయిస్తే, ముందుగా శాస్త్రీయ, సాంకేతిక అధ్యయనాలు నిర్వహిస్తామని కేంద్రం తెలిపింది.
వివరాలు
E20 పెట్రోల్ సురక్షితమేనా?
ఆటోమొబైల్ కంపెనీలు, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు, పరిశోధనా సంస్థలు, ఇతర సంబంధిత వర్గాలతో చర్చలు జరిపిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.
E20 పెట్రోల్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది.
ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI),సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM),ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్,ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం,ఇతర ఆటోమొబైల్ సంస్థలు E20 ఇంధనంపై ల్యాబ్ పరీక్షలు, ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహించినట్లు కేంద్రం తెలిపింది.
ఈ పరీక్షల్లో ఇంజిన్ జీవితకాలం, వాహనం నడిపే సమయంలో అనుభవం,ఇంజిన్ స్టార్టింగ్,తుప్పు ప్రభావం,వివిధ పదార్థాలతో ఇంధన అనుకూలత,ఇంధన సామర్థ్యం తదితర అంశాలను పరిశీలించినట్లు ప్రభుత్వం పేర్కొంది.
ఈ అంశాల పరంగా E20 ఇంధనం సురక్షితంగానే ఉందని కేంద్రం చెబుతోంది.
వివరాలు
పాత వాహనాల పరిస్థితి ఏంటి?
ఇప్పటికే రోడ్లపై తిరుగుతున్న పాత వాహనాలు E20 ఇంధనాన్ని ఉపయోగించడం వల్ల పనితీరులో గణనీయమైన మార్పులు లేదా నష్టాలను ఎదుర్కొన్నట్లు నిర్ధారించే ఆధారాలు లేవని కేంద్రం తెలిపింది.
దేశంలో E15+ పెట్రోల్ మూడేళ్లకు పైగా, E19-E20 ఇంధనం రెండున్నర సంవత్సరాలకు పైగా వినియోగంలో ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు.
ప్రస్తుతం దేశంలో 20 కోట్లకు పైగా ద్విచక్ర వాహనాలు, 3 కోట్లకు పైగా పెట్రోల్ కార్లు ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని వినియోగిస్తున్నాయని ప్రభుత్వం వెల్లడించింది.
ఇథనాల్ మిశ్రమ ఇంధనానికి, పెద్ద స్థాయిలో ఇంజిన్ వైఫల్యాలు లేదా వాహనాలు బ్రేక్డౌన్ కావడానికి ప్రత్యక్ష సంబంధం ఉందని నిరూపించే ధృవీకరించదగిన ఆధారాలు ఇప్పటివరకు లేవని కేంద్రం పేర్కొంది.
వివరాలు
మొత్తంగా చూస్తే..
డీజిల్లో ఇథనాల్ కలపడం వల్ల ఫ్లాష్ పాయింట్ గణనీయంగా తగ్గుతున్నట్లు పరీక్షల్లో తేలింది.
దీనివల్ల డీజిల్ నిల్వ, రవాణా, నిర్వహణ సమయంలో భద్రతకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ప్రస్తుతానికి నిలిపివేసింది.
అదే సమయంలో పెట్రోల్లో E20కి మించి ఇథనాల్ కలపాలా? వద్దా? అనే అంశంపై కేంద్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
శాస్త్రీయ పరిశోధనలు, సాంకేతిక అధ్యయనాలు, ఆటోమొబైల్ పరిశ్రమ, చమురు సంస్థలు, పరిశోధనా సంస్థలు తదితర సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది.