Ex-US military: ఇండో-నేపాల్ సరిహద్దులో అమెరికా మాజీ సైనికుడి అరెస్ట్.. విచారణలో సంచలన విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ నుంచి నేపాల్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ అమెరికా పౌరుడిని ఉత్తర్ప్రదేశ్లోని ఇండో-నేపాల్ సరిహద్దు వద్ద శశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. సోనౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైనిహ్వా ప్రాంతంలో ఎస్ఎస్బీ బృందం సాధారణ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారుల వివరాల ప్రకారం, పట్టుబడిన వ్యక్తి అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన 36 ఏళ్ల జోర్డాన్ బ్రౌన్గా గుర్తించారు. భద్రతా సిబ్బంది తనిఖీల కోసం అతడిని నిలిపివేయగా, అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన ఎస్ఎస్బీ సిబ్బంది అతడిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
వివరాలు
సముద్ర మార్గం ద్వారా భారత్లోకి..
అందులో బ్రౌన్ కాలికి తాడు కట్టి భద్రతా సిబ్బంది తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియోలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.
విచారణలో బ్రౌన్కు సంబంధించిన పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
మహారాజ్గంజ్ అదనపు ఎస్పీ సిద్ధార్థ్ వెల్లడించిన వివరాల ప్రకారం, అతడు ఎలాంటి చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రాలు లేకుండానే గత ఏడాది నవంబర్లో సముద్ర మార్గం ద్వారా భారత్లోకి ప్రవేశించినట్లు గుర్తించారు.
అప్పటి నుంచి గోవాలోనే నివసిస్తున్నట్లు విచారణలో తేలిందని చెప్పారు.
ప్రాథమిక విచారణలో బ్రౌన్ ఇచ్చిన వివరాల ప్రకారం, తాను టూరిస్ట్ వీసాపై థాయ్లాండ్కు వెళ్లిన సమయంలో పాస్పోర్ట్ పోగొట్టుకున్నానని చెప్పాడు.
వివరాలు
అప్పటి నుంచి గోవాలోనే..
అనంతరం సముద్ర మార్గంలో శ్రీలంకకు చేరుకుని, అక్కడి నుంచి 2025నవంబర్ 2న మళ్లీ సముద్రమార్గం ద్వారానే భారత్లోకి ప్రవేశించినట్లు తెలిపినట్లు అధికారులు వెల్లడించారు.
అప్పటి నుంచి గోవాలోనే ఉంటున్నానని అతడు విచారణలో చెప్పినట్లు సమాచారం.
ఇక టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం,జోర్డాన్ బ్రౌన్ విచారణలో అధికారులకు భిన్నమైన సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
తాను యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో చదివానని,అలాగే 2024వరకు దాదాపు ఆరేళ్లపాటు అమెరికా నేవీతో పాటు ఫారిన్ సర్వీసెస్లో పనిచేశానని పేర్కొన్నట్లు సమాచారం.
ప్రస్తుతం బ్రౌన్ నేపాల్లోకి అక్రమంగా వెళ్లేందుకు ఎందుకు ప్రయత్నించాడు?అతని భారత్ ప్రవేశం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? అతడు చెప్పిన వివరాలు నిజమేనా? అనే కోణాల్లో నిఘా సంస్థలు, స్థానిక పోలీసులు సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు.