Godavari Water Availability: గోదావరిలో 1,435 టీఎంసీల నీళ్లు.. తెలంగాణకు 968 టీఎంసీలు.. ఏపీకి 516
ఈ వార్తాకథనం ఏంటి
గోదావరి నదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 1,435 టీఎంసీల నీటి లభ్యత ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) స్పష్టం చేసింది. పోలవరం ద్వారా మళ్లించే 45 టీఎంసీల జలాలను కలుపుకుంటే మొత్తం లభ్యత 1,480 టీఎంసీలకు చేరుతుందని వెల్లడించింది. ఇందులో తెలంగాణకు 968 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కు 516 టీఎంసీల వాటా ఉన్నట్లు పేర్కొంది.
వివరాలు
జీఆర్ఎంబీ ఆధ్వర్యంలో సమావేశం
గోదావరి పరీవాహక ప్రాంతం, ఉప బేసిన్లలో నీటి లభ్యతపై మంగళవారం దిల్లీలోని సీడబ్ల్యూసీ కార్యాలయంలో గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. జీఆర్ఎంబీ ఛైర్మన్ పద్మా డోర్జి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీడబ్ల్యూసీ హైడ్రాలజీ విభాగం చీఫ్ ఇంజినీర్ సంజయ్కుమార్ గంగ్వార్ పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఇంజినీర్లు ఆన్లైన్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. 2023 అధ్యయన నివేదిక వివరాలు సమావేశంలో 2023లో గోదావరి నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ నిర్వహించిన అధ్యయనానికి సంబంధించిన వివరాలను రెండు రాష్ట్రాల అధికారులకు వివరించినట్లు సమాచారం.
వివరాలు
ఉప బేసిన్ల వారీగా విశ్లేషణ
గోదావరి నదిలో మొత్తం 3,397 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని,గోదావరి జల వివాదాల పరిష్కార ట్రైబ్యునల్ (జీడబ్ల్యూడీటీ) కేటాయింపుల ప్రకారం రాష్ట్రాల వాటాలు, వివిధ ఉప బేసిన్లలో నీటి లభ్యతను ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రాణహిత బేసిన్ (గోదావరి ఉప బేసిన్ జీ-9)లో 313 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్లు అధికారులు వివరించారు. అలాగే మంజీరా, మానేరు, పెన్గంగ, వార్ధా ఉప బేసిన్ల నుంచి గోదావరిలోకి చేరే ప్రవాహాల వివరాలను జీ-7 నుంచి జీ-10 వరకు ప్రదర్శించారు. శబరి ఉప బేసిన్ నుంచి వచ్చే జలాలను కూడా లెక్కల్లో చేర్చి విశ్లేషణ చేపట్టినట్లు తెలిపారు.
వివరాలు
ఏపీ అభ్యంతరాలు
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అధికారులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. గోదావరిలో తెలంగాణకు పేర్కొంటున్న స్థాయిలో నీటి లభ్యత లేదని, కేటాయింపుల విషయంలో కూడా పునఃపరిశీలన అవసరమని అభిప్రాయపడ్డారు. తెలంగాణ సమర్పించిన డేటాను ఆధారంగా తీసుకుని సీడబ్ల్యూసీ తిరిగి అదే లెక్కలను పరిశీలించినట్లు కనిపిస్తోందని వారు పేర్కొన్నారు. నీటి లభ్యతను అంచనా వేయడానికి 40 ఏళ్ల గణాంకాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉండగా, 38 ఏళ్ల సమాచారాన్నే ప్రామాణికంగా తీసుకున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. సీతారామ సహా కొన్ని ప్రాజెక్టులపై సమగ్ర అధ్యయనం లేకుండానే అనుమతులు ఇవ్వడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు.
వివరాలు
తెలంగాణ వాదనలు
ఏపీ అభ్యంతరాలను తెలంగాణ అధికారులు ఖండించారు. బచావత్ ట్రైబ్యునల్ అవార్డు ప్రకారం తెలంగాణకు 968 టీఎంసీల నీటి వాటా ఉందని, అదే ఆధారంగా ప్రాజెక్టులకు అనుమతులు మంజూరయ్యాయని వివరించారు. అంతేకాకుండా జీ-7 నుంచి జీ-10 వరకు ఉన్న ఉప బేసిన్లలో అంచనాలకు మించి నీటి లభ్యత ఉందని, అదనపు జలాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. కాబట్టి గోదావరిలో నీటి కొరత ఉందనే వాదనకు అవకాశం లేదని స్పష్టం చేశారు. మరోసారి సమావేశం రెండు రాష్ట్రాల వాదనలు, అభ్యంతరాలను నమోదు చేసిన సీడబ్ల్యూసీ ఈ అంశంపై మరోసారి సమావేశం నిర్వహించనున్నట్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సూచించినట్లు తెలిసింది.