Amrit Bharat Express: సంక్రాంతి కానుకగా ఏపీ ప్రయాణికులు శుభవార్త.. కొత్తగా మూడు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రైల్వేశాఖ భారీ శుభవార్త అందించింది. సంక్రాంతి పండగ సందర్భంగా ప్రయాణికులకు పెద్ద గిఫ్ట్ను ప్రకటించింది. కొత్తగా మరో మూడు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానుంది. త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి ప్రయోజనం కలిగేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగానే తమిళనాడు నుంచి కొత్తగా మూడు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను కేటాయించింది. ఈ మూడు రైళ్లు తమిళనాడు నుంచి బయల్దేరి ఆంధ్రప్రదేశ్ మీదుగా పశ్చిమబెంగాల్ వరకు ప్రయాణించనున్నాయి. దీంతో ఏపీలోని ప్రయాణికులకు పెద్ద ఎత్తున లాభం చేకూరనుంది.
Details
ఏపీ ప్రజలకు పండగే
ఈ నేపథ్యంలో ఈ మూడు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల షెడ్యూల్స్తో పాటు, అవి వెళ్లే మార్గాలు ఏమిటన్న వివరాలు ఇప్పుడు చూద్దాం. తిరుచిరాపల్లి నుంచి పశ్చిమబెంగాల్లోని న్యూ జలపాయ్ వరకు ఒక అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును నడపనున్నారు. ఈ రైలు చిదంబరం, తాంబరం, చెన్నై ఎగ్మోర్, చెంగల్పట్లు, విల్లుపురం, కడలూరు, మైలాడుథురై, కుంభకోణం, తంజావూరు, విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్, ఖరగ్పూర్ స్టేషన్ల మీదుగా ప్రయాణించనుంది. ఇక రెండో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు తాంబరం-సంత్రాగచ్చి మధ్య సర్వీసులు అందించనుంది. ఈ రైలు చెన్నై ఎగ్మోర్, విజయవాడ, ఖరగ్పూర్, భువనేశ్వర్ స్టేషన్లలో ఆగనుంది.
Details
ఈ స్టేషన్ల మీదుగా ప్రయాణించనుంది
మూడో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు నాగకోయిల్-న్యూ జలపాయ్ మధ్య నడవనుంది. ఈ రైలు దిండిగల్, మధురై, విరుధ్నగర్, పళని, ఉడుమాల్పేట, పొల్చాచ్చి, కోయంబత్తూర్, తిరుప్పూర్, సేలం, ఈరోడ్ మీదుగా ప్రయాణించి, ఆపై విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్, ఖరగ్పూర్ స్టేషన్ల మీదుగా తన ప్రయాణాన్ని కొనసాగించనుంది.
Details
త్వరలో మోదీ చేతుల మీదుగా ప్రారంభం
ఈ మూడు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ నిర్ణయం వల్ల తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల ప్రజలకు పెద్ద ఎత్తున లాభం చేకూరనుంది. ఇప్పటికే సామాన్య ప్రయాణికుల కోసం దేశవ్యాప్తంగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.