Vijayawada: పుస్తక ప్రియులకు శుభవార్త.. విజయవాడలో ఇవాళ్టి నుంచి బుక్ ఫెయిర్ ఓపెన్, టైమింగ్స్ ఇవే
ఈ వార్తాకథనం ఏంటి
విజయవాడలో పుస్తక ప్రియులకు శుభవార్త. నగరంలో నిర్వహిస్తున్న 36వ బుక్ ఫెయిర్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ పుస్తక మహోత్సవం జనవరి 12వ తేదీ వరకు కొనసాగనుంది. బుక్ ఫెయిర్లోని ప్రతి స్టాల్లోనూ ఏ పుస్తకం కొనుగోలు చేసినా 10 శాతం డిస్కౌంట్ అందించనున్నారు.
Details
36వ విజయవాడ బుక్ ఫెయిర్కు సర్వం సిద్ధం
పుస్తక ప్రియుల కోసం ప్రతి ఏటా నిర్వహించే విజయవాడ బుక్ ఫెయిర్ ఈసారి కూడా ఘనంగా ప్రారంభం కానుంది. ఇందుకోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ్టి నుంచి జనవరి 12 వరకు ఈ పుస్తక మహోత్సవం సందర్శకులకు అందుబాటులో ఉంటుంది.
Details
బుక్ ఫెయిర్ - ముఖ్య వివరాలు
విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ నగరపాలక క్రీడాప్రాంగణంలో బుక్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. బుక్ ఫెయిర్ ప్రాంగణానికి వడ్లమూడి విమలాదేవి పేరు పెట్టారు. ప్రధాన సాహిత్య వేదికకు ప్రముఖ రచయిత డాక్టర్ బి.వి. పట్టాభిరామ్ పేరు ఖరారు చేశారు. ప్రతిభా వేదికకు ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జయంత్ నార్లీకర్ పేరు పెట్టారు. ఈ బుక్ ఫెయిర్ జనవరి 2 నుంచి జనవరి 12 వరకు కొనసాగుతుంది. ప్రతి రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు బుక్ ఫెయిర్ తెరిచి ఉంటుంది. శనివారం, ఆదివారాల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటి గంటకే స్టాళ్లు తెరుస్తారు.
Details
హజరుకానున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి
ఈసారి మొత్తం 309 స్టాళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి స్టాల్లోనూ 10 శాతం డిస్కౌంట్ వర్తిస్తుంది. ఏ పుస్తకం కొనుగోలు చేసినా ఈ తగ్గింపు అందుబాటులో ఉంటుంది. బుక్ ఫెయిర్లో భాగంగా జనవరి 6న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనవరి 9న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు.
Details
జాతీయ, అంతర్జాతీయ ప్రచురణ సంస్థల సందడి
ప్రతేడాది మాదిరిగానే ఈసారి కూడా అనేక జాతీయ, అంతర్జాతీయ పుస్తక ప్రచురణ సంస్థలు బుక్ ఫెయిర్కు హాజరుకానున్నాయి. తెలుగు అకాడమీ, విశాలాంధ్ర, నవతెలంగాణ, నవోదయ, ఎమెస్కో, తెలుగు బుక్స్, సేజ్, పెంగ్విన్, నవయుగ వంటి ప్రముఖ ప్రచురణ సంస్థల స్టాళ్లు ఒకేచోట కనిపించనున్నాయి. విలువైన నవలలు, సాహిత్య విశ్లేషణ పుస్తకాలు, వివిధ అంశాలకు సంబంధించిన గ్రంథాలతో ఈ పుస్తక మహోత్సవం కొనసాగనుంది. ప్రతి ఏడాది నిర్వహించే ఈ అతిపెద్ద బుక్ ఫెయిర్ కోసం పుస్తక ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈసారి కూడా భారీగా పుస్తక విక్రయాలు జరిగే అవకాశముందని నిర్వాహకులు భావిస్తున్నారు.