
Census: జన గణన ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్.. కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో 15 ఏళ్ల విరామానంతరం చేపట్టబోయే జనగణన (Census) ప్రక్రియకు సంబంధించి కీలక అడుగు పడింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సోమవారం అధికారిక గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
ఇది మొత్తం 16వ జనగణన కాగా, స్వాతంత్య్రానంతరం జరగబోయే 8వ జనాభా లెక్కల దశగా నమోదైంది.
రెండు విడతలుగా జరగనున్న ఈ భారీ ప్రక్రియను 2027 మార్చి 1వ తేదీ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈసారి ప్రత్యేకత ఏమిటంటే.. జన గణనతో పాటు కుల గణన (Caste Census) కూడా కేంద్రం చేపట్టబోతోంది.
ఇందుకోసం 34 లక్షల మంది గణకులు, సూపర్వైజర్లు, 1.34 లక్షల మంది సిబ్బంది ఈ ప్రక్రియలో భాగస్వాములు కానున్నారు.
Details
డిజిటల్ పద్ధతిలో ప్రక్రియ
పాత విధానాలను పక్కనపెట్టి, ఈసారి మొత్తం ప్రక్రియను డిజిటల్ పద్ధతిలో నిర్వహించనున్నారు. డేటా సేకరణకు ట్యాబ్లెట్ పరికరాలు వాడతారు.
అంతే కాకుండా, ప్రజలు తమ వ్యక్తిగత సమాచారం స్వయంగా నమోదు చేసుకునేందుకు ప్రత్యేక పోర్టల్స్, మొబైల్ యాప్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.
డేటా భద్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పలు కఠిన భద్రతా చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.
సమాచారం సేకరణ, బదిలీ, నిల్వ వంటి అన్ని దశలను అత్యంత కట్టుదిట్టంగా నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది.