Telangana: తెలంగాణలో మండుతున్న ఎండలు.. రానున్న మూడ్రోజులు 44 డిగ్రీలకు చేరే అవకాశం.. ఆ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న మూడు రోజులలో ఈ ఉష్ణోగ్రతలు క్రమంగా మరింత పెరిగి మరో ఒకటి నుంచి రెండు డిగ్రీల వరకు అధికమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ కాలంలో పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలతో పాటు ఖమ్మం, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
వివరాలు
వడగాలులు వీచే జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ
ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిజామాబాద్, ఖమ్మం, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. అలాగే గురువారం రోజున ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతంతో పాటు నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో కూడా వడగాలులు ప్రభావం చూపనున్నాయని వెల్లడించారు. వడగాలులు వీచే జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.