US Russia sanctions bill: రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా ఆంక్షలు.. భారత్లో పెట్రో ధరలు పెరుగుతాయా?
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి కల్పించే బిల్లును ఆ దేశ ప్రతినిధుల సభ ఆమోదించింది. ఈ బిల్లు ప్రస్తుతం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం కోసం సిద్ధంగా ఉంది. ఈ చట్టం అమల్లోకి వస్తే.. రష్యా నుంచి భారీగా ముడిచమురును దిగుమతి చేసుకుంటున్న భారత్పై ప్రభావం పడే అవకాశం ఉంది. భారత్లో పెట్రోల్,డీజిల్ ధరలపై ఈ పరిణామం ఎలాంటి ప్రభావం చూపుతుందనే చర్చ మొదలైంది. 2022 నుంచి రష్యా భారత్కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా కొనసాగుతోంది.
వ్విఅరలు
రష్యా చమురు స్థానంలో ప్రత్యామ్నాయ సరఫరాలపై భారత్ దృష్టి
గణాంకాల ప్రకారం.. 2026 ఆర్థిక సంవత్సరంలో భారత్ సుమారు 40.8 బిలియన్ డాలర్ల విలువైన రష్యా ముడిచమురును దిగుమతి చేసుకుంది.
ఇది దేశ మొత్తం చమురు దిగుమతుల్లో 30.3శాతానికి సమానం. 2026 జూలై నాటికి ఈ వాటా 51 శాతానికి చేరింది.
దేశీయ అవసరాల్లో 88 శాతానికి పైగా ముడిచమురు దిగుమతులపైనే ఆధారపడుతున్న నేపథ్యంలో.. రష్యా నుంచి వచ్చే చమురు భారత్కు ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు.
అయితే అమెరికా కొత్త చట్టం కారణంగా రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిచిపోతే.. వెంటనే పెట్రోల్ బంకుల్లో ధరలు పెరుగుతాయని చెప్పడం సరికాదు.
భారత రిఫైనరీలు మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, లాటిన్ అమెరికా తదితర ప్రాంతాల నుంచి ప్రత్యామ్నాయంగా ముడిచమురును కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలించవచ్చు.
వివరాలు
రాయితీలు తగ్గితే.. భారత్కు పెరగనున్న చమురు ఖర్చులు!
అయితే ఈ మార్పుతో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది.
రష్యా నుంచి లభించే చమురు రాయితీలు ఇప్పటికే గణనీయంగా తగ్గాయి.
దీంతో ప్రత్యామ్నాయ దేశాల నుంచి ముడిచమురును కొనుగోలు చేయడానికి ఎక్కువ మొత్తం చెల్లించాల్సి రావచ్చు.
మరోవైపు.. ప్రపంచ మార్కెట్లోకి రష్యా చమురు సరఫరా తగ్గితే మొత్తం సరఫరాపై ఒత్తిడి పెరిగి అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగే ప్రమాదం ఉంది.
ఇది భారత్పై పరోక్షంగా అదనపు ఆర్థిక భారాన్ని మోపవచ్చు.
వివరాలు
రష్యా చమురు కొనుగోళ్లపై భారత్కు వాణిజ్య, ఆర్థిక సవాళ్లు
అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించిన బిల్లు ప్రకారం.. భారత్లో విక్రయించే పెట్రోల్పై నేరుగా టారిఫ్లు విధించరు.
రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగించే దేశాలపై అమెరికా విధించే సుంకాలు.. ఆ దేశాలు అమెరికాకు చేసే ఎగుమతులపై ప్రభావం చూపే విధంగా ఉంటాయి.
అంటే భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగిస్తే అమెరికాతో వాణిజ్యపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
అదే సమయంలో కొనుగోళ్లు నిలిపివేస్తే.. ఇతర దేశాల నుంచి అధిక ధరలకు చమురు దిగుమతి చేసుకోవాల్సి రావచ్చు.
దీంతో భారత్ ఆర్థికంగా సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంది.
వివరాలు
పెట్రో ధరలపై ప్రభావం.. ఈ అంశాలే కీలకం!
భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలు అంతర్జాతీయ ముడిచమురు ధరలు,పన్నులు,రవాణా ఖర్చులు, డీలర్ కమీషన్లు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయిస్తాయి.
గతంలో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిన సందర్భాల్లో.. వినియోగదారులపై భారం తగ్గించేందుకు ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాల్లో మార్పులు చేసింది.
ప్రస్తుతం కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై తుది ప్రభావం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.
అంతర్జాతీయ ముడిచమురు ధరలు, ప్రత్యామ్నాయ సరఫరాల వ్యయం, రూపాయి-డాలర్ మారకం విలువ, రిఫైనరీ మార్జిన్లు, ప్రభుత్వ విధానాలు ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి.
అందువల్ల అమెరికా తాజా నిర్ణయం నేపథ్యంలో దేశంలో పెట్రోల్ ధరలు ఎంత మేరకు పెరుగుతాయనే దానిపై ఇప్పుడే కచ్చితమైన అంచనాకు రావడం సాధ్యం కాదని విశ్లేషకులు చెబుతున్నారు.