Hyderabad: న్యూ ఇయర్ స్పెషల్.. అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్లోని మెట్రో రైల్ సర్వీసులను అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. డిసెంబరు 31 రాత్రి వేడుకలను దృష్టిలో పెట్టుకొని సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అర్థరాత్రి 12:15 గంటలకు చివరి మెట్రో రైలు స్టేషన్ల నుంచి బయలుదేరుతుందని వివరించారు. జనవరి 1న తెల్లవారుజామున 1 గంటలకు ఆ రేళ్లు వాటి గమ్యస్థానాలకు చేరుకుంటాయని చెప్పారు. ప్రయాణికులందరికీ సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు మెట్రో రైల్ పోలీసులు, భద్రతా సిబ్బందిని మోహరిస్తామని హామీ ఇచ్చారు. మెట్రో రైళ్లలో ప్రయాణించేటప్పుడు మార్గదర్శకాలు, ప్రయాణ మర్యాదలను పాటించాలని ప్రయాణికులను కోరారు.