LOADING...
West Bengal: గ్యాప్ దొరికితే 10 నిమిషాల్లో ఇండియాలోకి.. అక్రమ వలసదారుల సంచలన ప్రకటన
గ్యాప్ దొరికితే 10 నిమిషాల్లో ఇండియాలోకి.. అక్రమ వలసదారుల సంచలన ప్రకటన

West Bengal: గ్యాప్ దొరికితే 10 నిమిషాల్లో ఇండియాలోకి.. అక్రమ వలసదారుల సంచలన ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
May 29, 2026
11:50 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్‌లో అక్రమ బంగ్లాదేశీ వలసదారులపై కొనసాగుతున్న కఠిన చర్యల నేపథ్యంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భారతదేశంలో దశాబ్దాలుగా నివసిస్తున్న పలువురు అక్రమ వలసదారులు, తాము ఎలా సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించామో, ఎలా గుర్తింపు పత్రాలు పొందామో ఇప్పుడు బయటపెడుతున్నారు. మధ్యవర్తులు, నకిలీ పత్రాలు, రాజకీయ మద్దతుతో నడిచిన భారీ వ్యవస్థపై వారి వాంగ్మూలాలు సంచలనం రేపుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న కఠిన తనిఖీలు, నిర్బంధ కేంద్రాల భయంతో వందలాది మంది బంగ్లాదేశీయులు ఇప్పుడు సరిహద్దు ప్రాంతాలు, ట్రాన్సిట్ టెర్మినళ్ల వద్దకు చేరుకుంటున్నారు. కొందరు స్వచ్ఛందంగా తిరిగి బంగ్లాదేశ్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

వివరాలు

రాత్రివేళల్లో సరిహద్దు దాటింపు

అక్రమ వలసదారుల కథనాల ప్రకారం, 'దలాల్'లుగా పిలిచే మధ్యవర్తులు రాత్రివేళల్లో బీఎస్‌ఎఫ్ గస్తీని గమనిస్తూ, గ్యాప్ దొరికిన వెంటనే వారిని భారత్‌లోకి పంపేవారని వెల్లడించారు. బంగ్లాదేశ్‌లోని కుష్టియా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మాట్లాడుతూ, ఒక్కొక్కరి నుంచి రూ.7,000 నుంచి రూ.8,000 వరకు తీసుకుని మధ్యవర్తులు సరిహద్దు దాటించేవారని తెలిపాడు. "రాత్రంతా అవకాశం కోసం వేచి ఉండాల్సి వచ్చేది. కొన్నిసార్లు 10 నిమిషాల్లోనే భారత్‌లోకి తీసుకువచ్చేవారు" అని ఆయన వివరించాడు. మరో బంగ్లాదేశీ వ్యక్తి మాట్లాడుతూ, సైనిక భద్రత ఉన్నప్పటికీ రూ.20,000 చెల్లించి భారత్‌లోకి ప్రవేశించానని తెలిపాడు. "ఆధార్ కార్డు కోసం మరో రూ.2,000 నుంచి రూ.3,000 ఖర్చయింది. తర్వాత రైలులో బెంగళూరుకు వెళ్లామని చెప్పాడు.

వివరాలు

రాజకీయ మద్దతుతో గుర్తింపు పత్రాలు?

కొంతమంది అక్రమ వలసదారులు పశ్చిమ బెంగాల్‌లో అధికార పార్టీకి చెందిన స్థానిక కార్యకర్తల సహాయంతో ఓటర్ కార్డులు, రేషన్ కార్డులు పొందినట్లు ఆరోపించారు. ఓ మహిళ మాట్లాడుతూ, "మమతా బెనర్జీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పార్టీ నాయకుల సహాయంతో నాకు ఓటర్ కార్డు, రేషన్ కార్డు వచ్చాయి. లక్ష్మీర్ భండార్ పథకం కింద రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు డబ్బులు కూడా వచ్చాయని పేర్కొన్నారు. మరో వ్యక్తి మాట్లాడుతూ, "టీఎంసీ పాలనలో ఎవరూ ఏమీ అడగలేదు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మమ్మల్ని ఇళ్లలో ఉంచితే యజమానులకు జరిమానాలు, జైలు శిక్షలు పడతాయని భయపడుతున్నారని తెలిపాడు. తాను భారత్‌లో ఓటు కూడా వేసినట్లు, తన భార్యకు నగదు పథకాల లబ్ధి అందినట్లు చెప్పాడు.

Advertisement

వివరాలు

సరిహద్దు భద్రతపై కేంద్రం ఫోకస్

బంగ్లాదేశ్‌తో ఉన్న 4,096 కిలోమీటర్ల సరిహద్దులో నదులు, వ్యవసాయ భూములు, జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఉండటంతో అక్రమ రవాణా ముఠాలు వీటిని ఉపయోగించుకుంటున్నాయని భద్రతా సంస్థలు చెబుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, స్వచ్ఛందంగా తిరిగి వెళ్తున్న చొరబాటుదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోబోమన్నారు. అలాగే బీఎస్‌ఎఫ్‌కు 600 హెక్టార్ల భూమి అప్పగించినందుకు పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి‌ను అభినందించారు. ఇక మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ప్రకారం, ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులో కంచె నిర్మాణం దాదాపు పూర్తికావచ్చిందని, కేవలం 40-45 కిలోమీటర్ల పని మాత్రమే మిగిలి ఉందన్నారు. కేంద్ర హోంశాఖ ప్రకారం 2025 ఫిబ్రవరి నాటికి మొత్తం సరిహద్దులో 79 శాతం మేర ఫెన్సింగ్ పూర్తయింది.

Advertisement

వివరాలు

సంవత్సరాలుగా భారత్‌లోనే జీవితం

ప్రస్తుతం సరిహద్దుల వద్ద కనిపిస్తున్న పలువురు బంగ్లాదేశీయులు, తాము భారత్‌లో సంవత్సరాలుగా కార్మికులు, మేస్త్రీలు, గృహ సహాయకులుగా పనిచేశామని చెబుతున్నారు. ఖుల్నా జిల్లాకు చెందిన సలామ్ దాలి అనే వ్యక్తి ఐదేళ్ల క్రితం రూ.8,000 నుంచి రూ.10,000 చెల్లించి భారత్‌లోకి వచ్చినట్లు వెల్లడించాడు. మరో వ్యక్తి "నేను చిన్నపిల్లాడినప్పుడే మా తల్లిదండ్రులు భారత్‌కు తీసుకొచ్చారు. మా తండ్రి కార్పెంటర్‌గా పనిచేశాడు. ఇక్కడే జీవించామని చెప్పాడు. ఇంకొంతమంది నిర్బంధ కేంద్రాల భయంతో స్వచ్ఛందంగా బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తున్నట్లు సమాచారం. ఖుల్నాకు చెందిన తక్లీమా ఖతూన్ అనే మహిళ గృహ సహాయకురాలిగా పనిచేసేందుకు రెండేళ్ల క్రితం భారత్‌లోకి వచ్చానని తెలిపింది.

Advertisement