LOADING...
CBSE: సీబీఎస్‌ఈ పోర్టల్‌పై ఏఐ టూల్స్‌ ప్రయోగం.. ఐఐటీ నిపుణులతో కేంద్రం దర్యాప్తు
సీబీఎస్‌ఈ పోర్టల్‌పై ఏఐ టూల్స్‌ ప్రయోగం.. ఐఐటీ నిపుణులతో కేంద్రం దర్యాప్తు

CBSE: సీబీఎస్‌ఈ పోర్టల్‌పై ఏఐ టూల్స్‌ ప్రయోగం.. ఐఐటీ నిపుణులతో కేంద్రం దర్యాప్తు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 04, 2026
11:46 am

ఈ వార్తాకథనం ఏంటి

12వ తరగతి పరీక్షల మూల్యాంకనం కోసం ఈ ఏడాది సీబీఎస్‌ఈ ప్రవేశపెట్టిన ఆన్‌-స్క్రీన్‌ మార్కింగ్‌ (ఓఎస్‌ఎం) విధానం వివాదానికి కేంద్రబిందువుగా మారింది. తమ జవాబు పత్రాలు మారిపోయాయని కొందరు విద్యార్థులు ఆరోపించడంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో ఘటనపై సమగ్ర విచారణ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఐఐటీ కాన్పూర్‌, ఐఐటీ మద్రాస్ నిపుణులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, సీబీఎస్‌ఈ మరియు ఓఎస్‌ఎం పోర్టళ్లలోని భద్రతా లోపాలను గుర్తించి వాటిలోకి చొరబడేందుకు అధునాతన క్లాడ్‌ టూల్స్‌ను వినియోగించినట్లు కమిటీ ప్రాథమికంగా గుర్తించింది. ఈ ఘటనను సైబర్ భద్రతా కోణంలో లోతుగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

వివరాలు 

ఓఎస్‌ఎం నిర్వహణలో లోపాలు

సమీక్ష సందర్భంగా ప్యానెల్‌ పలు కీలక అంశాలను వెలుగులోకి తీసుకొచ్చింది. 12వ తరగతి పరీక్షల మూల్యాంకనం కోసం రూపొందించిన ఓఎస్‌ఎం డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ను నిర్వహిస్తున్న కోఎంప్ట్‌ ఎడ్యుటెక్‌ సంస్థకు, ఆ వ్యవస్థను అవసరమైన స్థాయిలో సురక్షితంగా నిర్వహించే సాంకేతిక నైపుణ్యం, భద్రతాపరమైన అవగాహన తగినంతగా లేదని గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని, ఓఎస్‌ఎం డేటాను అమెజాన్ వెబ్ సర్వీసెస్‌ ఇండియా ప్రభుత్వ నియంత్రిత విభాగానికి బదిలీ చేసింది. ఈ ప్రక్రియ కారణంగా కొంత ఆలస్యం జరిగినప్పటికీ, అనంతరం సీబీఎస్‌ఈ వెరిఫికేషన్‌ మరియు రీవాల్యుయేషన్‌ పోర్టళ్లు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. ఈ వ్యవస్థలను పునరుద్ధరించడంలో నిపుణుల బృందం కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.

వివరాలు 

ఇతర పరీక్షల వ్యవస్థలపైనా సమీక్ష

ఈ ఘటనతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం, ఇతర పరీక్షలకు సంబంధించిన డిజిటల్‌ వ్యవస్థల భద్రతను కూడా పరిశీలించే బాధ్యతను ఇదే ఉన్నతస్థాయి ప్యానెల్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Advertisement

వివరాలు 

సాధారణ సైబర్ దాడిగా చూడని ప్రభుత్వం

మరోవైపు, ఈ ఘటనను ప్రభుత్వం కేవలం సాధారణ సైబర్‌ దాడిగా పరిగణించడం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. సిస్టమ్‌ పూర్తిస్థాయిలో లైవ్‌లోకి రావడానికి సిద్ధమవుతున్న సమయంలో అందులోని బలహీనతలను బయటపెట్టేందుకు కొందరు ఎథికల్‌ హ్యాకర్లు చేపట్టిన చర్యగా దీనిని కొంతమంది అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇది ఏ రూపంలోని హ్యాకింగ్‌ అయినప్పటికీ, ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలవుతున్న కీలక డిజిటల్‌ ప్రాజెక్టుల్లో సైబర్‌ సెక్యూరిటీ ప్రమాణాలు ఎంత బలంగా ఉన్నాయన్న అంశంపై మరోసారి ప్రశ్నలు తలెత్తేలా చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement