Page Loader
Indiramma Houses: నెలాఖరులోగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు : మంత్రి పొంగులేటి
నెలాఖరులోగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు : మంత్రి పొంగులేటి

Indiramma Houses: నెలాఖరులోగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు : మంత్రి పొంగులేటి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 07, 2025
03:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ, రానున్న నాలుగేళ్లలో అర్హులందరికీ గృహాలను నిర్మించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసిన వారిలో అత్యంత నిరుపేదలను పారదర్శకంగా గుర్తించి, జనవరి 31లోగా గృహాలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ప్రతిపక్షంపై తీవ్ర విమర్శలు చేశారు. శాసనసభలో సలహాలు, సూచనలు ఇవ్వాలంటూ ప్రజలు ఆశించిన ప్రతిపక్షం, సభను తప్పుదారి పట్టిస్తోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రతిపక్షానికి గుండు సున్నా మాత్రమే వస్తుందని వ్యాఖ్యానించారు.

Details

హైదరాబాద్‌తో సమానంగా ఓరుగల్లును అభివృద్ధి

ఈనెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల పంపిణీ వంటి మూడు ప్రధాన పథకాలను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఆర్టీసీ వరంగల్ రీజియన్‌కు కేటాయించిన 112 విద్యుత్తు బస్సుల్లో 50 వాహనాలను హనుమకొండలో ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్‌తో సమానంగా ఓరుగల్లును అభివృద్ధి చేయడానికి రూ.6 వేల కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు. గత ప్రభుత్వంలో అపరిష్కృతంగా మిగిలిన 1.5 లక్షల ఇళ్లను పూర్తి చేసి, అర్హులకు అందజేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 80 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్నారని, 65 లక్షల మంది వివరాలను యాప్‌లో నమోదు చేశామని చెప్పారు.

Details

ఆటో డ్రైవర్లను రెచ్చగొడుతున్నారు

ఇప్పటివరకు 125 కోట్ల మంది ప్రయాణికులు ఆర్టీసీ ద్వారా రూ.4,350 కోట్ల ఉచిత ప్రయాణ సదుపాయం పొందారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కార్మికులకు భద్రత కల్పించడంతో పాటు 2013లో పెండింగ్‌లో ఉన్న బాండ్లు, 21% పీఆర్‌సీ చెల్లించినట్లు గుర్తుచేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంపై కొందరు ఆటో డ్రైవర్లను రెచ్చగొడుతున్నారని మంత్రి కొండా సురేఖ విమర్శించారు. ఈ సమావేశంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ పాల్గొన్నారు.