IMD: దేశంలో రుతుపవనాల రాక ఆలస్యం.. ఎండలు,భారీ వర్షాలపై వాతావరణ హెచ్చరికలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో రుతుపవనాల ప్రవేశం ఈసారి కొంత ఆలస్యంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తే ఈ నెల 31 నుంచి జూన్ 2 మధ్య కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకే అవకాశముందని తెలిపింది. అయితే వడగాలుల తీవ్రత మరింత పెరిగితే రుతుపవనాల రాక ఇంకా ఆలస్యం కావచ్చని హెచ్చరించింది. తెలంగాణలో జూన్ రెండో వారంలో రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
వివరాలు
ఈ రాష్ట్రాలకు యెల్లో అలెర్ట్ జారీ
ఇక రుతుపవనాలు పూర్తిగా ప్రవేశించే ముందు నుంచే కేరళలో భారీ వర్షాలు కురిసే పరిస్థితులు కనిపిస్తున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం అక్కడ పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. మరోవైపు తీవ్ర ఎండలతో అల్లాడుతున్న ఉత్తర భారత రాష్ట్రాలకు కూడా వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. పశ్చిమ అలజడుల ప్రభావంతో హిమాలయ ప్రాంత రాష్ట్రాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సంబంధిత రాష్ట్రాలకు యెల్లో అలెర్ట్ జారీ చేసింది.