Toll: గ్రీన్ఫీల్డ్ హైవేలో కొత్త మార్పు.. వైరా-దేవరపల్లి మార్గంలో టోల్ వసూళ్లు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలోని వైరా నుంచి ఆంధ్రప్రదేశ్లోని దేవరపల్లి వరకు నిర్మించిన నూతన గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిపై టోల్ వసూళ్లు అధికారికంగా ప్రారంభమయ్యాయి. వైరా వద్ద ఏర్పాటు చేసిన టోల్ ప్లాజాను భారత జాతీయ రహదారుల అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ దివ్య ప్రారంభించడంతో వాహనాల నుంచి రుసుము వసూలు మొదలైంది. ఈ హైవేపై ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్" చెల్లించే విధానాన్ని అమలు చేస్తున్నారు. తెలంగాణ పరిధిలోని 33వ కిలోమీటర్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని పొంగుటూరు వరకు సుమారు 149 కిలోమీటర్ల మేర ప్రయాణించే వాహనాలకు ఈ టోల్ ఛార్జీలు వర్తిస్తాయి.
వివరాలు
50 కిలోమీటర్లు దూరం తగ్గనుంది
కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ఈ గ్రీన్ఫీల్డ్ మార్గం వల్ల హైదరాబాద్ నుంచి విశాఖ పట్టణం వెళ్లే ప్రయాణికులకు సుమారు 50 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. దీంతో ప్రయాణ సమయం కూడా గణనీయంగా ఆదా అవుతుందని అధికారులు వెల్లడించారు. ఇక భద్రతా కారణాల దృష్ట్యా ఈ హైవేపై కొన్ని పరిమితులు విధించారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లు ఈ జాతీయ రహదారిపై ప్రయాణించేందుకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం చేపట్టినట్లు అధికారులు తెలిపారు.