LOADING...
Nine days of fire: 'నౌతపా'తో మండిపోతున్న దేశం.. హీట్‌వేవ్ అలర్ట్‌ జారీ
'నౌతపా'తో మండిపోతున్న దేశం.. హీట్‌వేవ్ అలర్ట్‌ జారీ

Nine days of fire: 'నౌతపా'తో మండిపోతున్న దేశం.. హీట్‌వేవ్ అలర్ట్‌ జారీ

వ్రాసిన వారు Sirish Praharaju
May 26, 2026
03:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

వసంతకాలం ముగిసిపోగా.. దేశవ్యాప్తంగా ఎండలు భగ్గుమంటున్నాయి. స్కూళ్లకు సెలవులు వచ్చినా పిల్లలు బయటకు రావడానికి భయపడుతున్నారు. ఎండ తీవ్రతతో రహదారులు వెలవెలబోతుండగా.. హిల్‌ స్టేషన్లకు వెళ్లే మార్గాలు పర్యాటకులతో కిక్కిరిసిపోతున్నాయి. మరోవైపు కొండప్రాంతాల్లో మంచు కరుగుతోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. మధ్యాహ్నానికి రోడ్లపై ఎండ మిరాజ్‌లా మెరుస్తుండగా.. చెట్ల నీడ కోసం జంతువులు అల్లాడుతున్నాయి. తీవ్ర ఉక్కపోతతో పక్షులు రాలిపోతున్నాయి. విద్యుత్ వినియోగం పెరగడంతో ట్రాన్స్‌ఫార్మర్లు కూడా వేడెక్కిపోతున్నాయి.

వివరాలు 

ఉత్తర భారతాన్ని కాల్చేస్తున్న 'నౌతపా'

ఉత్తర, మధ్య భారతదేశంలో సంప్రదాయంగా అత్యంత వేడిగా భావించే తొమ్మిది రోజుల "నౌతపా" కాలం ప్రారంభమైంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటిపోయాయి. దీంతో ప్రజల దైనందిన జీవితం తీవ్ర ఇబ్బందిగా మారింది. మే 25 నుంచి జూన్ 2 వరకు కొనసాగనున్న ఈ నౌతపా సమయంలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎల్‌నినో ప్రభావంతో ఈసారి ఎండలు మరింత తీవ్రంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. మే 25న ఉత్తరప్రదేశ్‌లోని బండా, మహారాష్ట్రలోని బ్రహ్మపురి ప్రాంతాల్లో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజస్థాన్, ఢిల్లీ-ఎన్‌సీఆర్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా వేడి గాలులు, ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

వివరాలు 

'నౌతపా' అంటే ఏమిటి?

హిందీ పదాలైన "నౌ" (తొమ్మిది), "తపా" (వేడి) నుంచి వచ్చిన పదమే నౌతపా. హిందూ క్యాలెండర్ ప్రకారం సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించే సమయంలో వచ్చే తొమ్మిది రోజుల కాలాన్ని నౌతపాగా పిలుస్తారు. రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో ఇది వేసవిలో అత్యంత వేడిగా ఉండే సమయంగా భావిస్తారు. వాతావరణ శాస్త్ర పరంగా కూడా మే చివరి, జూన్ ప్రారంభంలో సూర్య కిరణాలు నేరుగా ఉత్తర భారతంపై పడటంతో భూమి తీవ్రంగా వేడెక్కుతుంది. తక్కువ తేమ, పొడి గాలులు పరిస్థితిని మరింత తీవ్రమయ్యేలా చేస్తాయి. ఈసారి నౌతపా సమయంలో అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 48 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

Advertisement

వివరాలు 

ట్రాన్స్‌ఫార్మర్లకే కూలింగ్‌ ఏర్పాటు

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ప్రజలకు నీడ కల్పించేందుకు గ్రీన్ షేడ్ క్లాత్‌లు ఏర్పాటు చేశారు. నగరంలోని రోడ్లపై నీటి మిస్టింగ్ చేసి ఉష్ణోగ్రత తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. గోండా జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్లు వేడెక్కకుండా వాటి పక్కన పెద్ద ఫ్యాన్లు పెట్టి.. నిరంతరం నీళ్లు చల్లుతున్నారు. ప్రతి అరగంటకోసారి కూలింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నామని విద్యుత్ శాఖ సిబ్బంది తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావొద్దని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. తగినంత నీరు తాగాలని, తేలికపాటి దుస్తులు ధరించాలని వైద్యులు చెబుతున్నారు.

Advertisement

వివరాలు 

తెలంగాణలో హీట్‌స్ట్రోక్ మృతులు

తెలంగాణలో ఈ వేసవిలో ఇప్పటివరకు కనీసం 16 మంది వడదెబ్బతో మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఎండ తీవ్రత గతంలో ఎన్నడూ లేనంతగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అత్యధిక వేడి కారణంగా డీహైడ్రేషన్, హీట్ ఎగ్జాషన్, తీవ్రమైన సందర్భాల్లో అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వివరాలు 

ఎల్‌నినో ప్రభావమేనా? 

భూమి వేడెక్కడం, వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం కలిసి ఈ పరిస్థితులకు కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారత వాతావరణ శాఖ ప్రకారం.. హీట్‌వేవ్‌లు ఇప్పుడు ఎక్కువ కాలం కొనసాగుతూ మరింత తీవ్రంగా మారుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఏర్పడే ఎల్‌నినో ప్రభావం భారతదేశంలో పొడి వాతావరణాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఉత్తర, మధ్య భారతంపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా వాతావరణ సంస్థ NOAA ప్రకారం జూలై నాటికి ఎల్‌నినో ఏర్పడే అవకాశం 80 శాతం ఉంది. కొన్ని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు ఇది "సూపర్ ఎల్‌నినో"గా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నాయి.

వివరాలు 

సంప్రదాయం నుంచి వాస్తవానికి...

అయోధ్యలో నౌతపా సందర్భంగా దేవుళ్లకు చల్లదనం కలిగించేందుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు వారణాసిలో పిల్లలు గంగా నదిలో ఈత శిబిరాలకు వెళ్తూ ఎండ నుంచి ఉపశమనం పొందుతున్నారు. అయితే ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాలు నిప్పుల కుండలా మారిపోయాయి. సంప్రదాయంగా చెప్పుకునే "తొమ్మిది మండే రోజులు" ఇప్పుడు వాతావరణ మార్పుల కారణంగా మరింత భయానకంగా మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

Advertisement