PM Modi UAE: యూఏఈలోనూ మోదీ క్రేజ్ అదుర్స్.. 'అహ్లాన్ మోదీ'కి 65వేల మంది రిజిస్ట్రేషన్
ఫిబ్రవరి 13-14 తేదీల్లో యూఏఈలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ క్రమంలో మోదీకి స్వాగతం పలికేందుకు యూఏఈలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నారు. వాస్తవానికి ప్రస్తుతం యూఏఈలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రతికూల వాతావరణంలోనూ మోదీకి స్వాగతం పలికేందుకు చేస్తున్న ఏర్పాట్లలో ఏమాత్రం తగ్గడం లేదంటే.. అక్కడ ఆయనకు ఎలాంటి పాపులారిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. మోదీకి స్వాగతం పలికేందుకు జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో ఏర్పాటు చేసిన 'అహ్లాన్ మోదీ' కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ప్రతికూల వాతావరణంలోనూ 65,000 మందికి పైగా 'అహ్లాన్ మోదీ (అరబిక్లో హలో మోదీ)' కార్యక్రమానికి హాజరయ్యేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు
ప్రధాని మోదీ తన పర్యటనలో భాగంగా అరేబియా ద్వీపకల్పంలో తొలి హిందూ దేవాలయాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య కీలకమైన ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. రెండు దేశాల మధ్య సంబంధాలు, భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే కోణం దిశగా మోదీ పర్యటన ఉండే అవకాశం ఉంది. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భారత్, యూఏఈలు ఓడరేవుకు సంబంధించి ముఖ్యమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చు. ఇది కాకుండా, డిజిటల్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, ఇంధన సంబంధిత అంశాలపై కూడా ఇరు దేశాలు వివరంగా చర్చించనున్నాయి. యూఏఈలో ప్రవాస భారతీయ సమాజానికి చెందిన వారు 3.5 మిలియన్ల మంది ఉన్నారు. యూఏఈ జనాభా మొత్తంలో భారతీయులు 35 శాతం ఉండటం గమనార్హం.