PM Modi mementos e-auction:మోదీకి వచ్చిన బహుమతుల ఈ-వేలం..1,498 బహుమతులు వేలానికి..వెండి రాముడి జ్ఞాపిక ధర ఎంతో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ అందుకున్న బహుమతులు, జ్ఞాపికల ఎనిమిదో విడత ఈ-వేలం గురువారం (సెప్టెంబర్ 17)ప్రారంభం కానుంది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ వేలంలో మొత్తం 1,498వస్తువులను ప్రజల బిడ్డింగ్కు అందుబాటులో ఉంచుతున్నారు. ఈసారి ప్రత్యేకంగా 50'హీరో ఆబ్జెక్ట్స్'ను ఎంపిక చేశారు.వీటిలో కర్ణాటకకు చెందిన వెండి రాముడి జ్ఞాపిక అత్యధిక ప్రారంభ ధరతో జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఈ జ్ఞాపికకు ₹13.50లక్షల బేస్ ప్రైస్ నిర్ణయించారు.వేలంలో అధిక విలువ కలిగిన వస్తువుల్లో వెండితో తయారు చేసిన కాకతీయ కళా తోరణం ప్రతిరూపం రెండో స్థానంలో ఉంది. దీనికి ₹9 లక్షల ప్రారంభ ధర నిర్ణయించారు.ఆ తర్వాత "ట్రీ ఆఫ్ లైఫ్"పేరుతో రూపొందించిన ఫ్రేమ్ చేసిన గోండ్ కళాచిత్రం ఉంది.
వివరాలు
ప్రజాసేవకు ప్రతీకగా మోదీ జ్ఞాపికల వేలం
దీని బేస్ ప్రైస్ ₹7.50 లక్షలు. రథంపై ఏర్పాటు చేసిన జగన్నాథ పరివార్ కళాఖండానికి ₹6 లక్షలు, 99.99 శాతం స్వచ్ఛత కలిగిన బంగారు పూతతో ఫ్రేమ్ చేసిన రాధాకృష్ణుల చిత్రానికి ₹5.40 లక్షల ప్రారంభ ధరను నిర్ణయించారు.
ఈ కార్యక్రమంపై కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బుధవారం స్పందించారు. ఈ-వేలం ప్రధాని మోదీ ప్రజాసేవ విధానాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు.
"ప్రధాని ఎప్పుడూ స్వప్రయోజనం కోసం పనిచేయలేదు. దేశం తనకు అందించినది తన దగ్గరే ఉంచుకోవాల్సినది కాదని, తిరిగి ప్రజలకు చేరాల్సినదని ఆయన నిజంగా నమ్ముతారు. ఆ ఆలోచనను ఆచరణలో చూపిస్తున్నారు" అని షెకావత్ పేర్కొన్నారు.
వివరాలు
వివిధ రాష్ట్రాల కళా సంపదకు వేదికగా మోదీ జ్ఞాపికల వేలం
ఈ జ్ఞాపికలను దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించారు.
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం పశ్చిమ బెంగాల్, ఉత్తర్ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, అసోం, బిహార్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన వస్తువులు ఈ సేకరణలో గణనీయమైన భాగాన్ని కలిగి ఉన్నాయి.
భారతీయ కళా సంప్రదాయాలు, సాంప్రదాయ హస్తకళలు, సాంస్కృతిక ఆచారాలు, ఆధ్యాత్మిక సంప్రదాయాలు, క్రీడా విజయాలను ఈ వస్తువులు ప్రతిబింబిస్తున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ప్రధాని జ్ఞాపికల ఈ-వేలం తొలిసారిగా జనవరి 2019లో నిర్వహించారు.
పార్లమెంటులో మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం ఇప్పటివరకు జరిగిన వేలాల ద్వారా మొత్తం ₹52 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది.
వివరాలు
నమామి గంగేకు వేలం ఆదాయం
ఇప్పటివరకు అత్యధిక ధరకు అమ్ముడైన వ్యక్తిగత వస్తువుగా నీరజ్ చోప్రా 2020 టోక్యో ఒలింపిక్స్లో ఉపయోగించిన జావెలిన్ నిలిచింది.
దీనిని 2021లో నిర్వహించిన వేలంలో ₹1.5 కోట్లకు విక్రయించారు. గత వేలాల మాదిరిగానే ఈసారి కూడా ఈ-వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని 'నమామి గంగే' కార్యక్రమానికి విరాళంగా అందించనున్నారు.
గంగా నది పునరుజ్జీవనం, సంరక్షణపై దృష్టి సారించే కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యక్రమం ఇది.
ఆన్లైన్ వేలం ప్రారంభానికి ముందు ఈ జ్ఞాపికలను నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ (NGMA)లో ప్రదర్శించనున్నారు.
సందర్శకులు అక్కడికి వెళ్లి ఈ వస్తువులను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు.