PM Modi Turns 76: ప్రధాని మోదీ రాజకీయ ప్రయాణం.. ఆరెస్సెస్ ప్రచారక్ నుంచి పీఎంగా..
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17న 76వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు నెల రోజులపాటు 'సేవా సే సంకల్ప్ అభియాన్' పేరుతో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. ప్రధానికి ఆశీస్సులు అందించాలని కోరుతూ ప్రతి ఇంట్లో 'ఆశీర్వాద దీపం' వెలిగించాలని బీజేపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో సాధారణ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, దేశ ప్రధానిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టే స్థాయికి ఎదిగిన నరేంద్ర మోదీ ప్రయాణంపై ఆసక్తి నెలకొంది.
వివరాలు
చిన్నతనం నుంచే ఆరెస్సెస్తో అనుబంధం
నరేంద్ర మోదీ 1950 సెప్టెంబర్ 17న గుజరాత్లోని వాద్నగర్లో దామోదర్దాస్, హీరాబా దంపతులకు జన్మించారు.
నిరుపేద కుటుంబంలో పెరిగిన ఆయన.. చిన్నతనంలో తండ్రి నిర్వహించే టీ స్టాల్లో సహాయపడేవారు.
1970ల ప్రారంభంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్)లో చేరిన మోదీ.. ఆ తర్వాత పూర్తిస్థాయి ప్రచారక్గా పనిచేశారు.
వివరాలు
బీజేపీలోకి అడుగు.. కీలక మలుపు
సంస్థాగత కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ మోదీ క్రమంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
1985లో ఆరెస్సెస్ ఆయనను బీజేపీ గుజరాత్ విభాగానికి పంపింది. దీంతో ఆయన రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపు చోటుచేసుకుంది.
బీజేపీలో చేరిన తర్వాత మోదీ వరుసగా కీలక బాధ్యతలు చేపట్టారు.
1987లో గుజరాత్ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, 1995లో పార్టీ జాతీయ కార్యదర్శిగా, 1998లో జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు)గా నియమితులయ్యారు.
2001 అక్టోబర్లో కేశూభాయ్ పటేల్ స్థానంలో అనూహ్యంగా గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
వివరాలు
గుజరాత్లో వరుస విజయాలు
మోదీ నాయకత్వంలో 2002, 2007, 2012 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వరుస విజయాలు సాధించింది.
గుజరాత్కు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన.. మౌలిక సదుపాయాలు, ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చిన 'గుజరాత్ మోడల్' ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
తొలిసారి ప్రధానిగా బాధ్యతలు
2013లో బీజేపీ మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. అనంతరం 2014 లోక్సభ ఎన్నికల్లో పార్టీకి చారిత్రక మెజారిటీ లభించింది.
దీంతో పదేళ్ల యూపీఏ పాలనకు ముగింపు పలుకుతూ మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
తొలి పదవీకాలంలో స్వచ్ఛ భారత్ మిషన్, 2016లో పెద్ద నోట్ల రద్దు, 2017లో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలు వంటి కీలక నిర్ణయాలు, సంస్కరణలు చోటుచేసుకున్నాయి.
వివరాలు
2019లో మరింత భారీ మెజారిటీ
2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గతంలో కంటే మరింత భారీ మెజారిటీ సాధించింది. అనంతరం ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ నిషేధం వంటి కీలక నిర్ణయాలను మోదీ ప్రభుత్వం తీసుకుంది.
వరుసగా మూడోసారి ప్రధాని
2024 లోక్సభ ఎన్నికల అనంతరం మిత్రపక్షాల మద్దతుతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది.
నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.
భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నేతగా మోదీ చరిత్రలో నిలిచారు.