Prescription Drugs: మెడికల్ షాపుల్లో సీసీటీవీ నిఘా.. కేంద్రం కొత్త ప్రతిపాదనలు
ఈ వార్తాకథనం ఏంటి
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్తో విక్రయించే మందులపై కేంద్ర ప్రభుత్వం మరింత పర్యవేక్షణకు సిద్ధమవుతోంది. మందుల దుకాణాలు, ఇతర లైసెన్స్ పొందిన రిటైల్ కేంద్రాల్లో వైద్యుల సూచన మేరకు మందులు విక్రయించే సమయంలో సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా పనిచేసేలా నిబంధనలు తీసుకురావాలని ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది.
వివరాలు
మూడు నెలల పాటు రికార్డింగ్ భద్రపరచాలి
సెప్టెంబర్ 8న విడుదల చేసిన ముసాయిదా ప్రకారం.. రిజిస్టర్డ్ వైద్యుడు సూచించిన మందులను హోల్సేల్ విక్రయాలు మినహా ఇతర మార్గాల్లో సరఫరా చేసే సమయంలో లైసెన్స్ పొందిన ప్రాంగణంలో సీసీటీవీ వ్యవస్థ పనిచేస్తూ ఉండాలి.
మందు విక్రయం జరిగినట్లు నిర్ధారించుకునేలా దృశ్యాలను రికార్డు చేయాలి. ఈ రికార్డింగ్లను కనీసం మూడు నెలల పాటు భద్రపరచాలని ప్రతిపాదించారు.
ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయాలపై నిఘా
కొన్ని ప్రాంతాల్లో వైద్యుడి సూచన అవసరమైన మందులను సరైన ప్రిస్క్రిప్షన్ లేకుండానే విక్రయిస్తున్నారన్న ఆందోళనలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో తాజా ప్రతిపాదనను తీసుకొచ్చారు. మందుల విక్రయంలో బాధ్యతను పెంచడంతో పాటు నిబంధనల ఉల్లంఘనపై అధికారులు తనిఖీలు నిర్వహించేటప్పుడు సీసీటీవీ రికార్డులు ఉపయోగపడే అవకాశం ఉంది.
వివరాలు
అన్ని ప్రిస్క్రిప్షన్ మందులకూ వర్తింపు
ఈ నిబంధన షెడ్యూల్ హెచ్, హెచ్1, ఎక్స్ కేటగిరీల మందులకే పరిమితం కాదు.
వైద్యుడి ప్రిస్క్రిప్షన్తో సరఫరా చేసే అన్ని మందులకూ వర్తించేలా ముసాయిదాలో పేర్కొన్నారు.
అయితే హోల్సేల్ వ్యాపారులకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు.
దగ్గు సిరప్ల నిబంధనల నేపథ్యంలో ప్రాధాన్యం
ఇటీవల దగ్గు సిరప్ల విక్రయాలపై నిబంధనలు కఠినతరం చేసిన నేపథ్యంలో ఈ ప్రతిపాదనకు ప్రాధాన్యం ఏర్పడింది.
ముఖ్యంగా పిల్లలు, పెద్దలకు ఇచ్చే కొన్ని మందులను సరైన వైద్య పర్యవేక్షణ లేకుండా విక్రయించడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
వ్యక్తి వయసు, ఆరోగ్య పరిస్థితిని బట్టి మందు, మోతాదు నిర్ణయించాల్సి ఉండటంతో కేంద్రం ఈ అంశంపై దృష్టి సారించింది.
వివరాలు
ఇంకా అమల్లోకి రాని నిబంధన
సీసీటీవీ నిబంధన ప్రస్తుతం అమల్లోకి రాలేదు. ఇది కేవలం ముసాయిదా ప్రతిపాదన మాత్రమే. దీనిపై అభ్యంతరాలు, సూచనలు స్వీకరించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.
గెజిట్లో తుది నిబంధనలు ప్రచురించినప్పుడు ప్రభుత్వం పేర్కొనే తేదీ నుంచి మాత్రమే ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తుంది.