Annamalai: రాజీనామా తర్వాత రికార్డు మద్దతు.. అన్నామలైకి అపూర్వ స్పందన
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ మాజీ నేత అన్నామలై కొత్త ఉద్యమానికి అపూర్వ స్పందన లభిస్తోంది. బీజేపీకి రాజీనామా చేసిన 24 గంటల్లోనే ఆయన ప్రారంభించిన రాజకీయ ఉద్యమానికి భారీ స్థాయిలో మద్దతు కనిపిస్తోంది. ఇప్పటికే సుమారు 14 లక్షల మంది ఆయన ఉద్యమంలో చేరినట్లు సమాచారం. జూన్ 5న బీజేపీకి అధికారికంగా రాజీనామా చేసిన అనంతరం అన్నామలై తన కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రకటించారు. బీజేపీతో గత 18 నెలలుగా విభేదాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడు రాజకీయాలపై తన అభిప్రాయాలు, పార్టీ అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. తన కొత్త ప్రయాణాన్ని "ప్రజాకేంద్రిత రాజకీయాల కొత్త దశ"గా అన్నామలై అభివర్ణించారు.
వివరాలు
వంశపారంపర్య రాజకీయాలకు ముగింపు పలకాలి
యువత, సాధారణ ప్రజలు పెద్ద సంఖ్యలో ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయాలు కొన్ని కుటుంబాలకే లేదా శాశ్వత నేతలకే పరిమితం కాకూడదని, ప్రజల వద్దకే రాజకీయాలు చేరాలని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యక్తిపూజ, వంశపారంపర్య రాజకీయాలకు ముగింపు పలకడమే తన లక్ష్యమని ఆయన తెలిపారు. అన్నామలై ప్రారంభించిన "వి ద లీడర్" అనే రాజకీయ ఉద్యమానికి ఇప్పటికే విశేష స్పందన వస్తోంది. ఉద్యమ అధికారిక వెబ్సైట్ ప్రకారం ఇప్పటివరకు 14లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ ఉద్యమం విద్య, ఆరోగ్యం, పర్యావరణం, యువ నాయకత్వం వంటి రంగాల్లో సేవ చేయాలనుకునే స్వచ్ఛంద కార్యకర్తలను ఆహ్వానిస్తోంది. కొత్త ఉద్యమం ద్వారా రాబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు అన్నామలై ప్రకటించారు.