Ration Card Cancelled : రేషన్ కార్డుదారులకు షాక్.. ఓటర్ లిస్టులో పేరు లేకపోతే ఏమవుతుంది?
ఈ వార్తాకథనం ఏంటి
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక విడుదల చేసే తుది ఓటర్ల జాబితాలో పేరు లేకపోతే రేషన్ కార్డులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇ ప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తికాగా, త్వరలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ అమలు కానుంది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో తాజాగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అనర్హులుగా ఉన్న లబ్ధిదారులు, అక్రమ విదేశీ పౌరుల పేర్లతో ఉన్న రేషన్ కార్డులను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది.
వివరాలు
జూన్ 15లోగా పూర్తి చేయాలి
2026 ఓటర్ల జాబితాలో అనర్హులుగా గుర్తించిన ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) లబ్ధిదారులను గుర్తించి, వారి పేర్లను రేషన్ కార్డుల నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జూన్ 4నే జారీ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ ప్రక్రియను జూన్ 15లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా అర్హతకు మించి రేషన్ కార్డులు ఉన్నాయని గతంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పలుమార్లు వెల్లడించాయి. అయితే నేరుగా రేషన్ కార్డులను రద్దు చేస్తే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండటంతో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా ఆ దిశగా ముందడుగు వేయలేదని విశ్లేషకులు చెబుతున్నారు.
వివరాలు
రేషన్ కార్డుల తొలగింపు చర్యలు చేపట్టే అవకాశం
ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఓటర్ల జాబితాను ఆధారంగా చేసుకుని రేషన్ కార్డుల తొలగింపు చర్యలు చేపట్టే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ సాంకేతిక కారణాల వల్ల లేదా ఇతర కారణాలతో ఓటర్ల జాబితాలో పేరు తొలగించబడితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు సూచిస్తున్నారు. అటువంటి సందర్భాల్లో ఓటర్ హెల్ప్లైన్ యాప్ ద్వారా లేదా స్థానిక పోలింగ్ కేంద్రంలో ఫామ్-6 సమర్పించి పేరును తిరిగి నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఓటర్ల జాబితాలో పేరు లేకపోవడం మాత్రమే రేషన్ కార్డు రద్దుకు కారణం కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
వివరాలు
తుది నిర్ణయం వచ్చే వరకు రేషన్ సరఫరా
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కింద పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి, అలాగే ఎస్ఐఆర్ ట్రిబ్యునల్లో తమ పేరును చేర్చాలని అప్పీల్ చేసిన వారికి ప్రత్యేక మినహాయింపు ఉంటుంది. వారి దరఖాస్తులపై తుది నిర్ణయం వచ్చే వరకు రేషన్ సరఫరా కొనసాగుతుందని అధికారులు పేర్కొంటున్నారు.