Guru Randhawa's Gym: గురు రంధావా జిమ్పై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ పేరిట సంచలన హెచ్చరిక!
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. ప్రముఖ బాలీవుడ్ గాయకుడు గురు రంధావాకు చెందిన జిమ్ సెంటర్ లక్ష్యంగా గుర్తుతెలియని దుండుగులు కాల్పులకు పాల్పడ్డారు. ముఖాలకు మాస్కులు ధరించిన ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి కాల్పులు జరిపినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని అధికారులు వెల్లడించారు. ఘటన అనంతరం ఆ ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కాల్పులకు తామే బాధ్యులమంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో ఓ సోషల్ మీడియా పోస్ట్, ఆడియో క్లిప్ వైరల్ అవుతోంది.
వివరాలు
ప్రస్తుతం జరిగిన దాడి కేవలం "ట్రైలర్" మాత్రమే
అందులో నటుడు సల్మాన్ ఖాన్తో గురు రంధావాకు ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే ఆయనను లక్ష్యంగా చేసుకున్నామని పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా, గతంలో పలుమార్లు హెచ్చరికలు చేసినప్పటికీ గురు రంధావా వాటిని పట్టించుకోలేదని, ప్రస్తుతం జరిగిన దాడి కేవలం "ట్రైలర్" మాత్రమేనని ఆ ఆడియోలో ఉన్నట్లు సమాచారం. తమ లక్ష్యాలను ఎక్కడ ఉన్నా వదిలిపెట్టబోమంటూ హెచ్చరికలు చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, వైరల్ అవుతున్న పోస్టులు, ఆడియో క్లిప్లు నిజంగానే బిష్ణోయ్ గ్యాంగ్ విడుదల చేసినవేనా అనే విషయాన్ని పోలీసులు ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరించలేదు.
వివరాలు
గత ఏడాది సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల కాల్పులు
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తులు ఎవరు? వారి అసలు ఉద్దేశం ఏమిటి? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే, 1998 కృష్ణజింక వేట కేసు తర్వాత లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి నటుడు సల్మాన్ ఖాన్కు పలుమార్లు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. గత ఏడాది ముంబైలోని సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా గురు రంధావా జిమ్ వద్ద జరిగిన ఈ ఘటనతో మరోసారి బిష్ణోయ్ గ్యాంగ్ పేరు వార్తల్లో నిలిచింది.