Page Loader
Farmers: రైతులకు ఆధార్‌ తరహా కార్డుల జారీకి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు
Special Cards For Farmers For Implementation Of Government Schemes

Farmers: రైతులకు ఆధార్‌ తరహా కార్డుల జారీకి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 10, 2024
11:19 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలోని రైతుల కోసం పథకాల సమర్థవంతమైన అమలుకు కేంద్ర ప్రభుత్వం ఆధార్ తరహా ప్రత్యేక గుర్తింపు కార్డులను జారీ చేయడానికి సన్నాహాలు చేపట్టింది. ఈ క్రమంలో రైతుల నమోదు ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నది. అందులో భాగంగా, అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతుల నమోదు వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేయబడ్డాయి. రైతుల నమోదు గురించి అవగాహన పెంచి, అన్ని శాఖల సమన్వయంతో ఈ నమోదు ప్రక్రియను నిర్వహించడానికి ప్రాజెక్టు నిర్వహణ యూనిట్లను (PMUs) ఏర్పాటు చేయాలని సూచనలు ఇవ్వబడ్డాయి. ప్రస్తుతం 19 రాష్ట్రాలు కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి, అందులో తెలంగాణ కూడా ఒకటి.

వివరాలు 

 PMUలను ఏర్పాటుచేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ 

కేంద్రం ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం సోమవారం PMUలను ఏర్పాటుచేయడానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ PMUకు వ్యవసాయ సంచాలకుడు B. గోపి అధిపతిగా,సీసీఏల్ఏ కార్యదర్శి మంద మరకందు, ఐటీ శాఖ ఉప కార్యదర్శి భవేశ్ మిశ్రా, గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకుడు V. సర్వేశ్వర్ రెడ్డి, ఐటీ శాఖ సీనియర్ సంచాలకుడు రాధాకృష్ణలను సభ్యులుగా నియమించింది. ఈ PMU ఇప్పుడు రైతుల సమాచారం సేకరించడానికి సంబంధిత విధివిధానాలను రూపొందించి, వాటిని అమలు చేయనుంది. కేంద్రం ఇటీవల దేశవ్యాప్తంగా రైతుల కోసం పథకాల అమలులో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయని గుర్తించింది. వారి కోసం ప్రత్యేక గుర్తింపు సంఖ్యతో ప్రత్యేక కార్డులను జారీ చేసి, వాటిని వ్యవసాయ పథకాలకు అనుసంధానం చేయాలని నిర్ణయించింది.

వివరాలు 

వ్యవసాయ రంగం డిజిటలీకరణ కోసం రూ.2,817 కోట్లు 

దీనివల్ల రైతులు తమ పంటలను కనీస మద్దతు ధరకు అమ్ముకోవడానికి, ఇతర లావాదేవీలను సులభంగా నిర్వహించేందుకు వీలవుతుందని కేంద్రం ఆశిస్తోంది. 2024-25 బడ్జెట్‌లో వ్యవసాయ రంగం డిజిటలీకరణ కోసం కేంద్రం రూ.2,817 కోట్లను కేటాయించింది. ఈ ప్రాజెక్టు క్రింద ప్రత్యేక గుర్తింపు కార్డుల జారీకి కావలసిన అన్ని వివరాలను సేకరించి నమోదు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం, దేశంలోని అన్ని రాష్ట్రాల భూములు, పంటల వివరాలు కేంద్రానికి అందిస్తున్నాయి, అయితే రైతుల పంటలు, పశుసంపద మొదలైన ఇతర సమాచారం ఇంకా అందలేదు. కొత్తగా చేపట్టే నమోదు ప్రక్రియ ద్వారా అన్ని రకాల సమాచారం అందుబాటులోకి రాబోతున్నట్లు కేంద్రం భావిస్తోంది.