Neet Cases: నీట్ నిరసనకారులకు సుప్రీం ఊరట.. దేశవ్యాప్తంగా నమోదైన కేసులు రద్దు
ఈ వార్తాకథనం ఏంటి
నీట్ నిరసనలకు సంబంధించి దేశవ్యాప్తంగా విద్యార్థులపై నమోదైన కేసులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తనకు ఉన్న విస్తృత అధికారాలను వినియోగిస్తూ సంబంధిత ఎఫ్ఐఆర్లను రద్దు చేసింది. అయితే నిరసనల్లో పాల్గొన్న వారిలో తీవ్రమైన నేర చరిత్ర ఉన్న 2,873 మందిపై కొత్తగా కేసులు నమోదు చేసేందుకు కేంద్రం, దిల్లీ పోలీసులకు అనుమతి ఇచ్చింది. అదే సమయంలో.. ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థుల కుటుంబాలకు మూడు నెలల్లోగా పరిహారం అందించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో సెప్టెంబర్ 5న చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాన్ని విరమించుకుంటున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సుప్రీంకోర్టుకు తెలిపింది.
వివరాలు
మూడు నెలల సమయం
ఈ అంశంపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
జులై 20 నుంచి 25 మధ్య దేశవ్యాప్తంగా నీట్ నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్లను రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు తన రాజ్యాంగబద్ధ అధికారాలను వినియోగించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనాన్ని కోరారు.
నీట్ రద్దు తర్వాత ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందిస్తామని సీజేపీ ప్రతినిధులకు ఇచ్చిన హామీని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తుషార్ మెహతా తెలిపారు.
పరిహారం చెల్లింపునకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేసేందుకు మూడు నెలల సమయం కావాలని కేంద్రం తరఫున ఆయన కోర్టును అభ్యర్థించారు.
వివరాలు
2,873 మందిపై కొత్తగా కేసులు
కేంద్రం కోరిన సమయానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.
దీంతో జులై 20-25 మధ్య నీట్ నిరసనలకు సంబంధించి నమోదైన కేసులను కొట్టివేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.
అయితే తీవ్రమైన నేర చరిత్ర ఉన్న 2,873 మందిపై మాత్రం కొత్తగా కేసులు నమోదు చేసుకునే అవకాశం కేంద్రం, దిల్లీ పోలీసులకు కల్పించింది.