Cockroach Janta Party: 'ఇది ట్రైలర్ మాత్రమే'.. కాక్రోచ్ జనతా పార్టీ సంచలన హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
సోషల్ మీడియా వేదికగా ఏర్పడిన ''కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)'' శనివారం దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఆందోళనలో వందల సంఖ్యలో మద్దతుదారులు పాల్గొని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం, విద్యాశాఖ తీరును నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇదిలా ఉండగా, జంతర్ మంతర్లో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమం కేవలం ''ట్రైలర్ మాత్రమే'' అని సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. అసలు ఉద్యమం ఇంకా ముందుందని ఆయన సోషల్ మీడియా ద్వారా హెచ్చరించారు.
వివరాలు
నిరసనలో వేలాదిమంది ప్రజలు
ఈ సందర్భంగా స్పందించిన అభిజిత్ దీప్కే, వేలాది మంది నిరసనలో పాల్గొని చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. జంతర్ మంతర్ వేదికగా శాంతియుత నిరసన చేపట్టి, ఐక్యంగా ఉంటే ''బొద్దింకలు'' ఏమి చేయగలవో ప్రభుత్వానికి ట్రైలర్ చూపించామని వ్యాఖ్యానించారు. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నిరసనలో పాల్గొన్న వారిలో చాలామంది తమ జీవితంలో తొలిసారిగా ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారని ఆయన వెల్లడించారు. ఇది ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనమని పేర్కొన్నారు.
వివరాలు
కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని మరోసారి డిమాండ్ చేసిన అభిజిత్ దీప్కే, ఇందుకు ప్రభుత్వం లేదా మంత్రి స్పందించేందుకు ఏడు రోజుల గడువు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఒక తరం విద్యార్థుల భవిష్యత్తుతో ధర్మేంద్ర ప్రధాన్ ఆడుకున్నారని ఆరోపించారు. ఏడు రోజుల్లోగా ధర్మేంద్ర ప్రధాన్ స్వచ్ఛందంగా రాజీనామా చేయకపోయినా, లేదా ప్రభుత్వం ఆయనను పదవి నుంచి తొలగించకపోయినా, దేశవ్యాప్తంగా మరింత పెద్ద ఎత్తున భౌతిక ఆందోళనలు చేపడతామని సీజేపీ హెచ్చరించింది. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.