Train Accident: అస్సాంలో రైలు ప్రమాదం.. ఏనుగులను ఢీకొని పట్టాలు తప్పిన ఐదు బోగీలు
ఈ వార్తాకథనం ఏంటి
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో శనివారం తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. సైరాంగ్ నుంచి దిల్లీకి బయల్దేరిన రాజధాని ఎక్స్ప్రెస్ హొజాయ్ జిల్లాలో ఏనుగుల మందను ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు ఏనుగులు మృతి చెందగా, ప్రమాద తీవ్రతకు రైలు బోగీలు పట్టాలు తప్పాయి. నార్త్ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే అధికార ప్రతినిధి వివరాల ప్రకారం రైలు ఇంజిన్తో పాటు ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు లేదా ప్రాణనష్టం జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున సుమారు 2 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది.
Details
8 ఏనుగులు అక్కడికక్కడే మృతి
రైలు ఢీకొనడంతో 8 ఏనుగులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏనుగు తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే, అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లను దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ప్రమాదం జరిగిన ప్రాంతం ఎలిఫెంట్ కారిడార్ కాదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. పట్టాలపై ఏనుగుల మందను గమనించిన వెంటనే లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడని, అయినప్పటికీ ప్రమాదాన్ని నివారించలేకపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందన్నారు.