YSRCP-Thota Thrimurthulu-Court-Verdict: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు ఏడాదిన్నర జైలు..రెండు లక్షల జరిమానా
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ సీపీ (YSRCP) కి గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు (Thota Thrimurthulu) కు దళితుల శిరోముండనం కేసులో ఏడాదిన్నర పాటు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. జైలు శిక్షతో పాటు రెండులక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. ఈ మేరకు విశాఖ (Visakha) ఎస్సీఎస్టీ అత్యాచారాల కేసుల ప్రత్యేక కోర్టు (Court) మంగళవారం తీర్పు నిచ్చింది. 1996 డిసెంబర్ 29న ప్రస్తుత కోనసీమ జిల్లా (Konaseem District) రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో ఇద్దరు దళితులకు తోట త్రిమూర్తులు శిరోముండనం చేయించారు.
తనకు వ్యతిరేకంగా వ్యవహించారని...
తోట త్రిమూర్తులు ఎమ్మెల్యేగా పోటీ చేసిన తనకు వ్యతిరేకంగా వ్యవహరించారని వెంకటాయపాలెంలోని ఐదుగురు దళితులను తీవ్రంగా హింసించారు. అందులో ఇద్దరికి శిరోముండనం చేయించారు. ఈ ఆరోపణలపై తోట త్రిమూర్తులు పై పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసుల ప్రత్యేక కోర్టు ఈ కేసును 150సార్లు విచారణ చేసింది. సుదీర్ఘకాలం పాటు విచారణ సాగిన ఈ కేసులో తోట త్రిమూర్తులుకు 18 నెలలు జైలు శిక్షతో పాటు రెండు లక్షల రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. రెండేళ్ల కంటే ఎక్కువ జైలు శిక్ష పడకపోవడంతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు తోట త్రిమూర్తులుకు ఎటువంటి ఇబ్బంది లేకపోవచ్చని తెలుస్తోంది. అయితే దీనిపై వైసీపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.