
Vizag Steel Plant: ఆర్థిక ప్యాకేజీతో విశాఖ ఉక్కుకు కొత్త ఊపిరి
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ ఫలితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిస్థితిలో కొంత మార్పు కనిపించిందని ఉక్కు శాఖ 2024-25 వార్షిక నివేదిక పేర్కొంది.
గతేడాది అక్టోబర్ 28న రెండో బ్లాస్ట్ ఫర్నేస్ను తిరిగి ప్రారంభించిన అనంతరం ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగింది.
ప్రస్తుతం రెండు ఫర్నేస్లు రోజుకు సగటున 13,485 టన్నుల ఉత్పత్తి చేసి, 98% సామర్థ్యంతో నడుస్తున్నాయి.
హై ఎండ్ విలువ గల ఉక్కు ఉత్పత్తిని 12.96 లక్షల టన్నుల నుంచి 13.28 లక్షల టన్నులకు పెంచిన సంస్థ, దేశీయ మార్కెట్లో తన వాటాను 57% నుంచి 63%కి పెంచుకుంది.
Details
ఆర్థిక సంక్షోభం, నష్టాలు
ఆర్థిక ప్యాకేజీకి ముందు ప్లాంట్ తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొన్నది. పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేయలేకపోవడంతో, 2024 డిసెంబరు 31 నాటికి అమ్మకాలు రూ.12,429 కోట్లకు పరిమితమయ్యాయి.
ఇదే సమయంలో సంస్థ రూ.3,943.43 కోట్ల నికరనష్టాన్ని చవిచూసింది.
ఇక 2023-24లో మొత్తం నష్టం రూ.5,218.46 కోట్లకు చేరుకుంది - ఇది గత నాలుగేళ్లలో అత్యధిక నష్టం.
బ్లాస్ట్ ఫర్నేస్ల పనితీరు
రెండో బ్లాస్ట్ ఫర్నేస్ను ముందుగానే ప్రారంభించడం వల్ల, డిసెంబరు నాటికి మునుపటి ఉత్పత్తి సామర్థ్యాన్ని మించిపోయింది.
కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్న 13 వేల టన్నుల ఉత్పత్తిని దాటి, 3.7% అదనంగా సాధించడం విశేషం. బొగ్గు వినియోగంలో హార్డ్ కోకింగ్ కోల్ నిష్పత్తిని 57.5% నుంచి 53.4%కి తగ్గించింది.
Details
మార్కెట్ వ్యూహాలు
తన ఉత్పత్తుల మార్కెట్ను విస్తరించేందుకు సంస్థ కీలక నిర్ణయాలు తీసుకుంది. టీఎంటీ, స్ట్రక్చరల్స్ ఉత్పత్తుల విక్రయాల కోసం డిస్ట్రిబ్యూటర్/డీలర్ విధానాన్ని ప్రవేశపెట్టింది.
అలాగే, దేశవ్యాప్తంగా ఏ ప్రాంతానికైనా ఉత్పత్తులను అందించేందుకు 'ఈ-సువిధ' పోర్టల్ను ప్రారంభించింది.
వినియోగదారుల ఇంటి వద్దకే సేవలు అందించేందుకు సిద్ధమైంది. విక్రయాల్లో నేరుగా పంపిణీ చేసే పరిమాణం 30% నుంచి 42%కి పెరిగింది.
ఉద్యోగుల పరిమితి తగ్గింపు
2024 మార్చి 31 నాటికి సంస్థలో ఉన్న ఉద్యోగుల సంఖ్య 13,536గా ఉండగా, డిసెంబరు 31 నాటికి 12,338కి తగ్గింది. ఈ ఏడాదిలో మొత్తం 1,198 మంది ఉద్యోగులు తగ్గినట్లు నివేదిక పేర్కొంది.
Details
అదనపు ఆదాయం
గోదాముల్లో నిల్వగా ఉన్న 30 వేల టన్నుల ఉక్కును విక్రయించి అదనపు ఆదాయం పొందిన సంస్థ, 95,200 మెట్రిక్ టన్నుల ఇనుము, ఉక్కు తుక్కు విక్రయాల ద్వారా రూ.336 కోట్ల అదనపు రాబడి పొందింది.
మొత్తం విక్రయాల్లో హై ఎండ్ స్టీల్ వాటా 31% నుంచి 35%కి పెరిగింది.
వాటాల పెంపు
2024 మార్చి 31 నాటికి కంపెనీ అధీకృత వాటాలు రూ.8 వేల కోట్లు కాగా, డిసెంబరు 31 నాటికి అవి రూ.15 వేల కోట్లకు పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.
మొత్తంగా చూస్తే, కేంద్ర ఆర్థిక ప్యాకేజీ వల్ల కొన్ని కీలక మార్పులు వచ్చాయని, కానీ సంస్థ పూర్తిగా పునరుత్తరించాలంటే ఇంకా మరింత స్థిరమైన ప్రోత్సాహం,మార్కెట్ విస్తరణ అవసరమని స్పష్టమవుతోంది.