BRICS 2026: బ్రిక్స్ సదస్సు 2026 ఎప్పుడు.. ఎక్కడ జరుగుతుంది?
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ వేదికగా 18వ బ్రిక్స్ సదస్సు జరగనుంది.సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూదిల్లీలోని భారత్ మండపంలో ఈ సదస్సును నిర్వహించనున్నారు. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల అధినేతలతో పాటు ఆహ్వానిత దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. భారత్ నాలుగోసారి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కాలానికి ఈ సదస్సుతో ముగింపు పలకనున్నారు. ఇదే సమయంలో బ్రిక్స్ ఏర్పాటై 20 ఏళ్లు పూర్తవుతున్నాయి. భారత్ బ్రిక్స్ అధ్యక్షతకు "స్థితిస్థాపకత, ఆవిష్కరణలు,సహకారం,సుస్థిరత కోసం నిర్మాణం"అనే ఇతివృత్తాన్ని ఎంచుకుంది. "మానవత్వమే మొదట" అనే స్ఫూర్తితో ప్రజలే కేంద్రంగా ఉండే విధానాన్ని అనుసరించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనకు అనుగుణంగా ఈ థీమ్ను రూపొందించారు.
వివరాలు
350కుపైగా సమావేశాలు,ఉన్నతస్థాయి కార్యక్రమాలు
ఉమ్మడి ప్రాధాన్య అంశాలపై బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ప్రపంచ, ప్రాంతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకోవడం వంటి విషయాలపై సదస్సులో నేతలు చర్చించనున్నారు.
భారత్ అధ్యక్షతన గత ఏడాది విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించారు.
25కు పైగా నగరాల్లో 350కుపైగా సమావేశాలు, ఉన్నతస్థాయి కార్యక్రమాలు జరిగాయి.
బ్రిక్స్ సహకారంలోని మూడు ప్రధాన రంగాలైన రాజకీయ, భద్రతా సహకారం, ఆర్థిక-ఆర్థిక అంశాలు, సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలకు సంబంధించిన అంశాలపై ఈ కార్యక్రమాలు సాగాయి.
వివరాలు
జనవరి 1న నాలుగోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన భారత్
వ్యాపార సంస్థల మధ్య, ప్రజల మధ్య సంబంధాలను పెంచే కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు.
ఆచరణాత్మకంగా అమలు చేయగల, అభివృద్ధికి ఉపయోగపడే ఫలితాలను సాధించడమే లక్ష్యంగా భారత్ తన అధ్యక్ష బాధ్యతలను కొనసాగించింది.
బ్రిక్స్ వ్యవస్థాపక సభ్య దేశాల్లో భారత్ కూడా ఒకటి. గతంలో 2012, 2016, 2021లో భారత్ బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది.
ఈ ఏడాది జనవరి 1న నాలుగోసారి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించింది.
వివరాలు
బ్రిక్ నుంచి బ్రిక్స్గా.. (BrIC to Brics)
2006లో బ్రిక్స్ కూటమి 'బ్రిక్' (BRIC)గా ప్రారంభమైంది.
న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా బ్రిక్ దేశాల విదేశాంగ మంత్రుల తొలి సమావేశం జరిగింది.
అనంతరం 2009లో రష్యాలోని యెకటెరిన్బర్గ్లో తొలి బ్రిక్ శిఖరాగ్ర సదస్సు నిర్వహించారు.
2010లో న్యూయార్క్లో జరిగిన బ్రిక్ విదేశాంగ మంత్రుల సమావేశంలో దక్షిణాఫ్రికాను కూటమిలో చేర్చుకోవాలని సభ్య దేశాలు నిర్ణయించాయి.
ఆ తర్వాత 2011లో చైనాలోని సన్యాలో జరిగిన మూడో బ్రిక్స్ సదస్సులో దక్షిణాఫ్రికా పాల్గొంది.
2024 జనవరిలో ఈజిప్ట్,ఇథియోపియా,ఇరాన్,సౌదీ అరేబియా,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పూర్తిస్థాయి సభ్య దేశాలుగా చేరాయి.
2025 జనవరిలో ఇండోనేసియా కూడా బ్రిక్స్లో చేరింది. 2025లో బెలారస్,బొలీవియా,కజకిస్థాన్,క్యూబా, మలేసియా,నైజీరియా, థాయ్లాండ్, ఉగాండా, ఉజ్బెకిస్థాన్, వియత్నాం బ్రిక్స్ భాగస్వామ్య దేశాలుగా చేరాయి.