LOADING...
Cockroach Janta Party: భారత్‌కు తిరిగి వస్తున్న 'కాక్‌రోచ్ జనతా పార్టీ' వ్యవస్థాపకుడు.. ఎందుకంటే?
భారత్‌కు తిరిగి వస్తున్న 'కాక్‌రోచ్ జనతా పార్టీ' వ్యవస్థాపకుడు.. ఎందుకంటే?

Cockroach Janta Party: భారత్‌కు తిరిగి వస్తున్న 'కాక్‌రోచ్ జనతా పార్టీ' వ్యవస్థాపకుడు.. ఎందుకంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 01, 2026
05:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే అమెరికా నుంచి జూన్ 6న భారత్‌కు తిరిగి రానున్నట్లు ప్రకటించారు. వ్యంగ్య రాజకీయ ఉద్యమంగా ప్రారంభమైన ఈ పార్టీని స్థాపించిన తర్వాత ఆయన భారత్‌కు రావడం ఇదే తొలిసారి. స్వదేశానికి చేరుకున్న అనంతరం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన చేపట్టాలని ఆయన నిర్ణయించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన నిర్వహించనున్నట్లు దిప్కే తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను వినియోగించుకుంటూ యువత పెద్ద సంఖ్యలో ఈ నిరసనలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

వివరాలు 

కేంద్ర విద్యాశాఖ మంత్రిపై తీవ్ర విమర్శలు చేసిన దిప్కే

తాను భారత్‌కు చేరుకునే రోజున విమానాశ్రయానికి రావాలని మద్దతుదారులను కోరిన దిప్కే,అక్కడి నుంచి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి కోరనున్నట్లు వెల్లడించారు. ఎక్స్‌లో పోస్టు చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ,"ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ మనమంతా ఒక్కటిగా నిలబడి శాంతియుతంగా మన స్వరం వినిపించే సమయం వచ్చింది. అందరం కలిసి గొంతెత్తితే ప్రభుత్వం తప్పకుండా స్పందించాల్సి వస్తుంది" అని అన్నారు. 2026 నీట్-యూజీ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో రద్దు కావడంతో దిప్కే కేంద్ర విద్యాశాఖ మంత్రిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వివాదాల మధ్య పరీక్షను రద్దు చేసిన అధికారులు, జూన్ 21న మళ్లీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

వివరాలు 

22లక్షలకు పైగా ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యార్థులు

ఈ పరిణామాల తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ దిప్కే ఆన్‌లైన్ ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యం కారణంగా 22లక్షలకు పైగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన ఆరోపించారు. దీనిని పూర్తిస్థాయి "వ్యవస్థ వైఫల్యం"గా అభివర్ణిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

వివరాలు 

వారిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు.. స్పష్టం చేసిన ప్రధాన న్యాయమూర్తి 

గత నెలలో సోషల్ మీడియాలో యువత మధ్య వ్యంగ్య ఉద్యమంగా ప్రారంభమైన కాక్‌రోచ్ జనతా పార్టీ ఉద్యమం వేగంగా ప్రాచుర్యం పొందింది. మే 15న సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా నిరుద్యోగ యువత సోషల్ మీడియా, ఆర్టీఐ కార్యకలాపాల వైపు మళ్లుతున్నారన్న వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ఉద్యమం రూపుదిద్దుకుంది. అయితే, తన వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేశారని అనంతరం ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. నకిలీ డిగ్రీలతో న్యాయ వృత్తితో పాటు ఇతర రంగాల్లోకి ప్రవేశించే వారిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేసినట్లు వెల్లడించారు.

Advertisement