LOADING...
UK woman: భారత్ పర్యటన తర్వాత బ్రిటన్ మహిళ మెదడులో 38 పరాన్నజీవులు
భారత్ పర్యటన తర్వాత బ్రిటన్ మహిళ మెదడులో 38 పరాన్నజీవులు

UK woman: భారత్ పర్యటన తర్వాత బ్రిటన్ మహిళ మెదడులో 38 పరాన్నజీవులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 02, 2026
05:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

దాదాపు రెండు దశాబ్దాల క్రితం భారత్‌లో పర్యటించిన ఓ బ్రిటన్ మహిళ జీవితంలో ఆ ప్రయాణం ఊహించని మలుపు తీసుకొచ్చింది. పర్యటన సమయంలో ఆమె శరీరంలోకి ప్రవేశించిన ఒక పరాన్నజీవి కారణంగా మెదడులో ఏకంగా 38 పరాన్నజీవులు అభివృద్ధి చెందాయి. ఈ సమస్యతో ఆమె దాదాపు పదేళ్ల పాటు తీవ్ర అనారోగ్యంతో పోరాడాల్సి వచ్చింది. వేల్స్‌కు చెందిన 42 ఏళ్ల లోరీ డెన్‌మన్ 2007లో రెండు నెలల పాటు భారత్‌లో పర్యటించారు. ఆమె శాకాహారి అయినప్పటికీ, కలుషితమైన ఆహారం లేదా నీటి ద్వారా 'టీనియా సోలియం' అనే పరాన్నజీవి లార్వా ఆమె శరీరంలోకి ప్రవేశించింది. దాని ప్రభావంతో ఆమె 'న్యూరోసిస్టోసెర్కోసిస్' అనే అరుదైన ఇన్‌ఫెక్షన్ బారిన పడ్డారు.

వివరాలు 

ఆమె శరీరం నుంచి సుమారు మీటరు పొడవున్న టేప్‌వార్మ్

భారత్ పర్యటన ముగించుకుని స్వదేశానికి వెళ్లిన కొన్నేళ్ల తర్వాత, 2010లో ఒక రెస్టారెంట్ టాయిలెట్‌లో ఆమె శరీరం నుంచి సుమారు మీటరు పొడవున్న టేప్‌వార్మ్ (బద్దె పురుగు) బయటకు వచ్చింది. దీంతో ఆందోళన చెందిన లోరీ వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకున్నారు. అయితే, ఆ సమయంలో పరీక్షల్లో ఎలాంటి అసాధారణ పరిస్థితి కనిపించలేదని వైద్యులు వెల్లడించారు. అయితే ఏడాది గడవకముందే ఆమెకు తీవ్రమైన తలనొప్పులు, మాట్లాడటంలో ఇబ్బందులు, మూర్ఛ వంటి తీవ్రమైన లక్షణాలు కనిపించడం ప్రారంభమైంది. అనంతరం నిర్వహించిన స్కానింగ్‌లో ఆమె మెదడులో ఏకంగా 38 పరాన్నజీవులు ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయం వైద్యులను, ఆమె కుటుంబ సభ్యులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది.

వివరాలు 

ప్రస్తుతం కోలుకున్నా కొనసాగుతున్న మూర్ఛ వ్యాధి మందులు

దాదాపు పదేళ్ల పాటు యాంటీ-పారాసైటిక్ మందులు, స్టెరాయిడ్లతో చికిత్స కొనసాగింది. అయినప్పటికీ మధ్య మధ్యలో మూర్ఛలు రావడం, గందరగోళానికి గురికావడం, తీవ్రమైన ఆందోళన, సైకోసిస్ వంటి మానసిక సమస్యలు ఆమెను వెంటాడాయి. ఒక దశలో తన తండ్రి ఇంట్లో చిన్నపిల్లలా నేలపై పాకడం, దాక్కోవడం వంటి అసాధారణ ప్రవర్తన కూడా చేసేదని ఆమె స్నేహితురాలు గుర్తు చేశారు. చివరకు శస్త్రచికిత్స అవసరం లేకుండానే మందుల చికిత్సతో ఆ పరాన్నజీవులు నిర్వీర్యమై క్యాల్సిఫై అయ్యాయి. 2017 నుంచి తనకు మూర్ఛ రాలేదని, అయితే ఇప్పటికీ ప్రతిరోజూ మందులు తీసుకుంటున్నానని లోరీ వెల్లడించారు.

Advertisement

వివరాలు 

ఈ అనుభవం వల్ల కెరీర్‌ను కూడా వదులుకోవాల్సి వచ్చిందన్న లోరీ

ఈ అనుభవం తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని, మీడియా రంగంలో కొనసాగుతున్న తన కెరీర్‌ను కూడా వదులుకోవాల్సి వచ్చిందని లోరీ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం తాను సజీవంగా ఉండటం, ఆరోగ్యంగా కోలుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని, ఇకపై ఆరోగ్య విషయాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయనని ఆమె పేర్కొన్నారు. పర్యటనల సమయంలో కలుషితమైన ఆహారం లేదా నీటి ద్వారా సోకే ఇన్‌ఫెక్షన్లు కొన్నిసార్లు తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.

Advertisement