LinkedIn: లింక్డ్ఇన్ వేదికగా చైనా గూఢచారుల వల.. పాశ్చాత్య దేశాల కీలక సమాచారంపై కన్ను
ఈ వార్తాకథనం ఏంటి
ఉద్యోగాల కోసం ఉపయోగించే లింక్డ్ఇన్ (LinkedIn) వంటి వేదికలను చైనా గూఢచారులు తమ కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI), బ్రిటన్ గూఢచారి సంస్థ ఎంఐ5 (MI5), అలాగే ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ ప్రభుత్వాలు సంయుక్తంగా విడుదల చేసిన హెచ్చరికలో వెల్లడించాయి. చైనా గూఢచారులు ఆన్లైన్ రిక్రూటర్లు లేదా హెచ్ఆర్ సంస్థల ప్రతినిధులుగా నటిస్తూ పాశ్చాత్య దేశాల ఉద్యోగులను తమ వలలోకి దింపుతున్నట్లు పేర్కొన్నాయి. చైనా వెలుపల ఉన్నట్లు కనిపించే నకిలీ సంస్థల పేర్లతో ఈ కార్యకలాపాలు సాగిస్తున్నారని తెలిపాయి. బీజింగ్కు ఉపయోగపడే రహస్య సమాచారాన్ని సేకరించడమే వారి ప్రధాన లక్ష్యమని హెచ్చరించాయి.
వివరాలు
భద్రతా అనుమతులు ఉన్న ఉద్యోగులే ప్రధాన లక్ష్యం
చైనా సైనిక గూఢచారి విభాగాలు ముఖ్యంగా సైనిక, రాజకీయ, ఆర్థిక రంగాలకు చెందిన కీలక సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నాయని నివేదిక పేర్కొంది. ఈ సమాచారం ద్వారా అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్లతో కూడిన 'ఫైవ్ ఐస్' కూటమిపై చైనాకు వ్యూహాత్మక ఆధిక్యం లభించే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా భద్రతా అనుమతులు (సెక్యూరిటీ క్లియరెన్స్) కలిగిన ఉద్యోగులు, సైనిక సిబ్బంది, ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని రక్షణ రంగ నిపుణులు, జర్నలిస్టులు, విద్యావేత్తలు, థింక్ట్యాంక్ సంస్థల ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు వెల్లడించింది. వారి బయోడేటా, అనుభవం, వారికి తెలిసే అవకాశం ఉన్న సమాచారాన్ని బట్టి ఎంపిక చేస్తున్నట్లు పేర్కొంది.
వివరాలు
ఆరోపణలపై లింక్డ్ఇన్ స్పందన
గూఢచర్య ఆరోపణలపై స్పందించిన లింక్డ్ఇన్ ప్రతినిధి, నకిలీ ఖాతాలు సృష్టించడం లేదా తప్పుడు గుర్తింపుతో వ్యవహరించడం సంస్థ సేవా నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేశారు. ప్రభుత్వ మద్దతుతో జరిగే దుర్వినియోగ చర్యలను గుర్తించేందుకు సంస్థ ప్రత్యేకంగా కృషి చేస్తోందని, నకిలీ ఖాతాలపై కఠిన చర్యలు కొనసాగిస్తామని తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా విదేశీ గూఢచారి సంస్థలు నియామకాలు చేపడుతున్నాయనే ఆందోళనల మధ్య ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
వివరాలు
కన్సల్టెన్సీ ఉద్యోగుల ముసుగులో గూఢచారులు
ఫైవ్ ఐస్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ప్రకారం, చైనా సైనిక గూఢచారులు ప్రైవేట్ కన్సల్టెన్సీలు, థింక్ట్యాంక్లు, హెచ్ఆర్ సంస్థల ఉద్యోగులుగా నటిస్తున్నారు. విదేశాంగ, రక్షణ రంగ విశ్లేషకులను ఆకర్షించేందుకు ఆన్లైన్లో ఉద్యోగ ప్రకటనలు ఇస్తున్నారు. వాటికి స్పందించిన అభ్యర్థులతో ఇంటర్వ్యూలు నిర్వహించి, 'ట్రయల్ రిపోర్ట్' పేరుతో నివేదికలు రాయిస్తారు. ఆ తర్వాత క్రమంగా మరింత సున్నితమైన సమాచారాన్ని కోరుతూ అదనపు నివేదికలు సమర్పించమని అడుగుతారు. సహకరించిన వారికి వేల డాలర్ల పారితోషికం కూడా అందిస్తున్నట్లు హెచ్చరించారు.
వివరాలు
కొత్తది కాదు.. దశాబ్దంగా కొనసాగుతున్న వ్యూహం
సామాజిక మాధ్యమాల ద్వారా చైనా గూఢచారులు నియామకాలు చేపట్టడం కొత్త విషయం కాదని అమెరికా అధికారులు పేర్కొన్నారు. కనీసం పదేళ్లుగా ఈ తరహా కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు అమెరికా దర్యాప్తులు, అభియోగ పత్రాలు వెల్లడించాయని తెలిపారు. వాషింగ్టన్,దాని మిత్రదేశాలు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, ఈ ముప్పు ఇప్పటికీ కొనసాగుతోందని పాశ్చాత్య దేశాల అధికారులు భావిస్తున్నారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బీజింగ్ పర్యటన సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో మరింత నిర్మాణాత్మక సంబంధాలపై హామీలు ఇచ్చిన కొన్ని వారాలకే ఈ హెచ్చరిక వెలువడటం గమనార్హం.