
Google: రిమోట్ ఉద్యోగులకు గూగుల్ వార్నింగ్.. ఆఫీసుకు రాకపోతే 'ఫైరింగ్' తప్పదు
ఈ వార్తాకథనం ఏంటి
టెక్ రంగంలోకి సరికొత్తగా అడుగుపెడుతున్న కృత్రిమ మేధ (AI) రంగంపై భారీగా పెట్టుబడులు పెడుతూ ముందుకు సాగుతోంది గూగుల్ సంస్థ.
ఇదే సమయంలో ఖర్చుల నియంత్రణపైనా సంస్థ ప్రత్యేక దృష్టిసారిస్తోంది.
ఈ నేపథ్యంలో, 'రిటర్న్ టు ఆఫీసు' విధానాన్ని పూర్తిగా అమలుచేయాలన్న దిశగా నిర్ణయాలు తీసుకుంటోంది.
ఇందులో భాగంగా, కొంతమంది రిమోట్ ఉద్యోగులకు సంస్థ తుది హెచ్చరిక జారీ చేసింది.
వారు తప్పకుండా కార్యాలయానికి హాజరవ్వాలని, లేకపోతే స్వచ్ఛందంగా ఉద్యోగాన్ని వీడేందుకు సిద్ధమవ్వాలని చెప్పింది. ఈ విషయాన్ని అనేక అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి.
వివరాలు
తాజా మార్పులు గూగుల్ టెక్నికల్ సర్వీసెస్, పీపుల్ ఆపరేషన్స్ విభాగాల్లో..
గూగుల్ ఇప్పటికే ఉద్యోగులకు వారంలో కనీసం మూడురోజులు కార్యాలయానికి వచ్చి పని చేయాలని స్పష్టంగా తెలిపింది.
అయితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో కొంతమందికి శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అనుమతి కల్పించింది.
కానీ తాజాగా ఆ రిమోట్ ఉద్యోగుల్లో కొంతమందిని హైబ్రీడ్ మోడల్ వైపు మార్చాలని కంపెనీ ఆదేశించింది.
వారు ఈ విధానాన్ని అంగీకరించకపోతే, ఉద్యోగ సంబంధిత ప్రయోజనాల్లో కోతలు ఎదురవుతాయని, లేదంటే స్వచ్ఛంద విరమణ ప్యాకేజీలను ఎంచుకోవచ్చని సంస్థ సూచించింది.
ఈ తాజా మార్పులు గూగుల్ టెక్నికల్ సర్వీసెస్, పీపుల్ ఆపరేషన్స్ విభాగాల్లో పనిచేస్తున్న బృందాలపై వర్తిస్తాయని తెలిసింది.
ఈ ఉద్యోగులు తప్పనిసరిగా హైబ్రీడ్ విధానాన్ని అనుసరించాల్సి ఉంటుందని గూగుల్ తెలిపింది.
వివరాలు
2023 నుండి ఇప్పటివరకు అనేక దశల్లో ఉద్యోగాల తొలగింపు
లేకపోతే, కంపెనీ ఆఫీసులకు దగ్గరగా మారేందుకు వన్టైమ్ రీలోకేషన్ ప్యాకేజీని స్వీకరించవచ్చని సూచించింది.
ముఖ్యంగా, గూగుల్ కార్యాలయానికి 50 మైళ్ల పరిధిలో నివసిస్తున్నవారు జూన్ నాటికి ఈ కొత్త నియమాలను తప్పకుండా పాటించాలని స్పష్టంగా పేర్కొంది.
అయితే, ఈ మార్గదర్శకాలు ప్రతి రిమోట్ ఉద్యోగిపై వర్తించవని సంస్థలోని ఓ అధికారి వెల్లడించారు.
ఇక, కృత్రిమ మేధ రంగంలో గణనీయమైన పురోగతి సాధించాలన్న లక్ష్యంతో గూగుల్ సంస్థలో పెద్ద ఎత్తున పునర్వ్యవస్థీకరణ చర్యలు కొనసాగుతున్నాయి.
2023 నుండి ఇప్పటివరకు అనేక దశల్లో ఉద్యోగాల తొలగింపు (లేఆఫ్లు) జరిగాయి. 2024 చివరికి గూగుల్లో గ్లోబల్గా సుమారు 1,83,000 మంది ఉద్యోగులు ఉన్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది.