El Nino: గత వెయ్యేళ్లలో ఎన్నడూ లేనంత తీవ్రంగా ఎల్నినో.. కారణం ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
ఎల్నినో ప్రభావం గత వెయ్యేళ్లలో ఎన్నడూ లేనంత తీవ్రంగా మారిందని తాజా అధ్యయనం వెల్లడించింది. మిచిగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన జూలీ కోల్ నేతృత్వంలోని పరిశోధకులు గాలాపగోస్ దీవుల్లో లభించిన శిలాజ పగడాలను పరిశీలించి.. వెయ్యేళ్ల కాలానికి సంబంధించిన సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల వివరాలను పునర్నిర్మించారు. పారిశ్రామికీకరణకు ముందు కాలంలో కనిపించిన ఎల్నినో పరిస్థితులతో పోలిస్తే.. ప్రస్తుతం నమోదవుతున్న ఎల్నినో ప్రభావాలు పూర్తిగా భిన్నంగా, మరింత తీవ్రంగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది.
వివరాలు
ఎల్నినో తీవ్రంగా ఉండే ప్రాంతంలోనే పరిశోధన
ఎల్నినో ప్రభావం ఎక్కువగా కనిపించే తూర్పు పసిఫిక్ ప్రాంతంలోని పగడాలపై పరిశోధకులు ప్రధానంగా దృష్టి పెట్టారు.
ఇవి ఏడాదికి ఒకటి నుంచి రెండు సెంటీమీటర్ల మేర పెరుగుతాయి.
వాటి కాల్షియం కార్బోనేట్ అస్థిపంజరాల్లో గతంలో సముద్రపు నీటి ఉష్ణోగ్రతలకు సంబంధించిన రసాయన సంకేతాలు నమోదవుతాయి.
ఈ పగడాల్లోని స్ట్రాన్షియం-కాల్షియం నిష్పత్తి, వివిధ ఆక్సిజన్ ఐసోటోపులను విశ్లేషించడం ద్వారా.. ఒక్కో పగడపు కాలనీ జీవించిన కాలానికి సంబంధించిన ఉష్ణోగ్రతల వివరాలను పరిశోధకులు రూపొందించారు.
వివరాలు
అధ్యయనంలో కీలక విషయాలు
క్రీ.శ. 1000 నుంచి 1850 వరకు ఉన్న పారిశ్రామికీకరణకు ముందు కాలంతో పోలిస్తే.. 1984 తర్వాత ఉష్ణోగ్రతల్లో మార్పులు 36.5 శాతం ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది.
అలాగే 1851 నుంచి 1982 మధ్య కాలంతో పోల్చినా ఈ మార్పులు 16.2 శాతం అధికంగా నమోదయ్యాయి.
గాలాపగోస్ దీవుల్లో గతంలో ఎల్నినో సమయంలో సాధారణ ఉష్ణోగ్రత కంటే ఒకటి లేదా రెండు డిగ్రీలు మాత్రమే ఎక్కువగా ఉండేదని జూలీ కోల్ తెలిపారు.
ప్రస్తుతం అది మూడు నుంచి నాలుగు డిగ్రీలకు చేరుతోందని వివరించారు.
దీన్నిబట్టి గతంతో పోలిస్తే ఆధునిక కాలంలో ఎల్నినో తీవ్రత గణనీయంగా పెరిగినట్లు స్పష్టమవుతోంది.
వివరాలు
ఎల్నినో మార్పులు పెరగడానికి మానవ కార్యకలాపాలే కారణం
ఉష్ణోగ్రతల్లో మార్పుల తీవ్రతలోనూ గణనీయమైన మార్పు కనిపించినట్లు పరిశోధకులు గుర్తించారు.
ముఖ్యంగా వేడి ఎక్కువగా ఉండే ఎల్నినో పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్నట్లు తేలింది.
ఈ మార్పులు సహజంగా చోటుచేసుకుంటున్నవి కావని, మానవ కార్యకలాపాల కారణంగానే ENSO (ఎల్నినో-సదరన్ ఆసిలేషన్)లో మార్పులు పెరిగాయని పరిశోధకులు తెలిపారు.
పగడాల నుంచి సేకరించిన వివరాలతో పాటు వాతావరణ నమూనాలను విశ్లేషించి ఈ నిర్ధారణకు వచ్చారు.
భూతాపం పెరగడమే దీనికి కారణమని, ఆ వేడిమి పెరగడానికి శిలాజ ఇంధనాల వినియోగమే ప్రధాన కారణమని జూలీ కోల్ పేర్కొన్నారు.