LOADING...
space sector: గగన్‌యాన్‌ నుంచి వాణిజ్య ప్రయోగాల వరకు.. 2026లో భారత అంతరిక్ష రంగానికి స్వర్ణయుగం 
2026లో భారత అంతరిక్ష రంగానికి స్వర్ణయుగం

space sector: గగన్‌యాన్‌ నుంచి వాణిజ్య ప్రయోగాల వరకు.. 2026లో భారత అంతరిక్ష రంగానికి స్వర్ణయుగం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 02, 2026
12:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

2026లో భారత అంతరిక్ష రంగం కొత్త శిఖరాలను అధిరోహించేందుకు సిద్ధమవుతోంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)కు శుభాన్షు శుక్లా విజయవంతంగా ప్రయాణించడం ద్వారా భారత్‌ మానవ అంతరిక్ష కార్యక్రమంలో కీలక ముందడుగు వేసింది. దీని ప్రభావంతో భవిష్యత్తులో సొంతంగా మనుషులతో కూడిన అంతరిక్ష ప్రయాణాలను నిర్వహించాలనే దిశగా దేశం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ ఏడాది చివర్లో గగన్‌యాన్‌ ప్రాజెక్ట్‌లో కీలక దశలు పూర్తైన తర్వాత, పూర్తి స్థాయి మానవ అంతరిక్ష యానంపై దృష్టి మరింత పెరగనుంది.

వివరాలు 

అంతరిక్ష రంగంలో ప్రైవేట్‌ సంస్థల పాత్ర

అంతరిక్ష రంగంలో ప్రైవేట్‌ సంస్థల పాత్ర కూడా గణనీయంగా పెరుగుతోంది. స్కైరూట్‌ ఏరోస్పేస్‌, అగ్నికుల్‌ కాస్మోస్‌ సంస్థలు దేశీయంగా అభివృద్ధి చేసిన విక్రమ్‌-1, అగ్నిబాన్‌ రాకెట్లను ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నాయి. వేగంగా విస్తరిస్తున్న చిన్న ఉపగ్రహాల ప్రయోగ మార్కెట్‌లో తమదైన స్థానం సంపాదించుకోవాలన్న లక్ష్యంతో ఈ సంస్థలు ముందుకెళ్తున్నాయి. కొత్త సంవత్సరంలో ఎల్‌ అండ్‌ టీ, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ కలిసి అభివృద్ధి చేసిన పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ) ప్రయోగం కూడా జరగనుంది. 2023లో ఈ సంస్థలు ఇస్రో నుంచి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్టును పొందాయి.

వివరాలు 

మార్చిలో గగన్‌యాన్‌ కీలక ప్రయోగం 

జీ-1గా పిలిచే గగన్‌యాన్‌ మిషన్‌ ఈ ఏడాది మార్చిలో ప్రయోగం అయ్యే అవకాశముందని కేంద్ర సైన్స్‌, టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ ఇటీవల పార్లమెంట్‌కు తెలిపారు. ఈ మిషన్‌లో భాగంగా వెళ్లే హ్యూమనాయిడ్‌ రోబో 'వ్యోమమిత్ర' వ్యోమగామి చేసే పనులను అనుకరించేలా రూపొందించారు. 2027లో జరగనున్న మానవులతో కూడిన అంతరిక్ష ప్రయాణానికి ముందుగా, లో ఎర్త్‌ ఆర్బిట్‌లో అవసరమైన సిబ్బంది వ్యవస్థలను పరీక్షించి ధ్రువీకరించడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది.

Advertisement

వివరాలు 

 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తొలి భారతీయుడిగా శుభాన్షు శుక్లా

పీఎస్‌ఎల్‌వీ-ఎన్‌1, అగ్నికుల్‌ సంస్థ అభివృద్ధి చేసిన 3డీ ప్రింటెడ్‌ ఇంజిన్లు, పిక్సెల్‌ హైపర్‌స్పెక్ట్రల్‌ కాన్‌స్టెలేషన్లతో పాటు క్వాంటం టెక్నాలజీల్లో జరుగుతున్న పురోగతితో 2026 నాటికి భారత్‌ అంతర్జాతీయ అంతరిక్ష శక్తుల సరసన నిలుస్తుందని ఇండియన్‌ స్పేస్‌ అసోసియేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఏకే భట్‌ తెలిపారు. ప్రైవేట్‌ లాంచ్‌ ప్యాడ్‌ల వంటి మౌలిక సదుపాయాలను పరిమితంగా వినియోగించినా ఈ లక్ష్యాన్ని సాధించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. గత ఏడాది ఆక్సియం-4 వాణిజ్య మిషన్‌లో భాగంగా శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు.

Advertisement

వివరాలు 

ప్రయోగ వ్యయాన్ని తగ్గించే ఉద్దేశం

అక్కడ ఆయన 18 రోజుల పాటు గడిపి, మైక్రో గ్రావిటీ పరిస్థితుల్లో పలు శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించారు. ఈ అనుభవం భారత మానవ అంతరిక్ష కార్యక్రమానికి ఎంతో ఉపయోగపడనుంది. ఐఐటీ మద్రాస్‌ నుంచి ప్రారంభమైన అగ్నికుల్‌ కాస్మోస్‌ సంస్థ పునర్వినియోగ రాకెట్ల అభివృద్ధిపై దృష్టి సారించింది. ప్రయోగ వ్యయాన్ని తగ్గించే ఉద్దేశంతో రాకెట్లను శాటిలైట్‌ మోడ్‌లో ఉపయోగించే విధానాలను కూడా పరిశీలిస్తోంది.

వివరాలు 

ఈ ఏడాదే స్కైరూట్‌ వాణిజ్య ప్రయోగం 

గత నెలలో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌ విధానంలో పర్యవేక్షిస్తుండగా,స్కైరూట్‌ ఏరోస్పేస్‌ తమ విక్రమ్‌-1 రాకెట్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. ఈ ఏడాది ఆరంభంలోనే వాణిజ్య పేలోడ్‌లతో ఈ రాకెట్‌ను ప్రయోగించాలనే లక్ష్యాన్ని కంపెనీ నిర్దేశించుకుంది. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నదిగంతరా ఇండస్ట్రీస్‌ గత మార్చిలో ప్రపంచంలోనే తొలి అంతరిక్ష నిఘా శాటిలైట్‌ 'స్కాట్‌'ను ప్రయోగించింది. ఈఏడాది మరో ఎనిమిది శాటిలైట్‌లను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. హై థ్రస్ట్‌ ఎలక్ట్రిక్‌ ప్రొపల్షన్‌ వ్యవస్థ,క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్‌, దేశీయంగా అభివృద్ధి చేసిన ట్రావెలింగ్‌ వేవ్‌ ట్యూబ్‌ యాంప్లిఫయర్‌ వంటి ఆధునికసాంకేతికతల పరీక్షలకోసం టీడీఎస్‌-01 శాటిలైట్‌ను ఇస్రో ప్రయోగించనుంది. అలాగే 2026మార్చి నాటికి స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌(ఎస్‌ఎస్‌ఎల్‌వీ)ద్వారా ప్రత్యేక శాటిలైట్‌ ప్రయోగించే అవకాశం ఉందని సమాచారం.

Advertisement