Gaganyan: గగన్యాన్ మిషన్లో మరో మైలురాయి.. డ్రోగ్ పారాచూట్ విజయవంతం
ఈ వార్తాకథనం ఏంటి
మానవులతో కూడిన అంతరిక్ష ప్రయాణ కార్యక్రమం 'గగన్యాన్' కోసం జరుగుతున్న సన్నాహాల్లో 'రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ' (డీఆర్డీవో) మరో ముఖ్యమైన దశను విజయవంతంగా పూర్తి చేసింది. దేశంలోనే అత్యంత బలమైన రిబ్బన్ పారాచూట్ల తయారీలో మన సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపిస్తూ, బుధవారం చండీగఢ్లో ఉన్న 'టెర్మినల్ బాలిస్టిక్స్ పరిశోధన ప్రయోగశాల' (టీబీఆర్ఎల్)లో కీలక పరీక్షను సఫలీకృతం చేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. ముఖ్యంగా డ్రోగ్ పారాచూట్ ఎంతమాత్రం బరువును భరించగలదో నిర్ధారించే పరీక్షను పూర్తిచేయడం ప్రాధాన్యత కలిగిన ముందడుగుగా పేర్కొంది.
వివరాలు
ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఇది మరో కీలక అడుగు: రాజ్నాథ్సింగ్
ఈ పరీక్షా కార్యక్రమంలో విక్రం సారాభాయ్ అంతరిక్ష కేంద్రం, ఇస్రో సహా పలు ప్రముఖ సంస్థలు భాగస్వామ్యమయ్యాయని తెలిపింది. అధిక వేగంతో జరిగే ఏరోడైనమిక్, బాలిస్టిక్ అంచనాల్లో విస్తృతంగా వినియోగించే 'రైల్ ట్రాక్ రాకెట్ స్లెడ్' (ఆర్టీఆర్ఎస్)ను ఈ ప్రయోగానికి ఉపయోగించినట్లు వివరించింది. నమూనా రూపకల్పన పరంగా పారాచూట్కు కల్పించిన అదనపు భద్రతా ప్రమాణాలు ఈ పరీక్షతో మరింత ధృవీకరించబడ్డాయని స్పష్టం చేసింది. ఈ విజయంపై డీఆర్డీవో, ఇస్రోలను రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ అభినందిస్తూ, ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఇది మరో కీలక అడుగుగా అభివర్ణించారు.