Earth's Expiry Date: భూమిపై జీవానికి గడువు ఉందా? కొత్త అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం
ఈ వార్తాకథనం ఏంటి
భూమిపై జీవానికి కూడా ఒక గడువు ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటివరకు భూమి అంతం అంటే భారీ గ్రహశకలం ఢీకొట్టడం లేదా తీవ్రమైన వాతావరణ విపత్తు వల్ల జరుగుతుందని చాలామంది భావించారు. అయితే తాజా అధ్యయనం ప్రకారం, భూమిపై జీవం అంతం ఒక్కసారిగా కాకుండా ఎంతో నెమ్మదిగా జరుగుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఒక దశలో చెట్లు, మొక్కలు, పూలు, గడ్డి సహా అన్ని జీవరాశులు క్రమంగా అంతరించిపోతాయని పేర్కొన్నారు.
వివరాలు
భూమిపై జీవం ఎప్పుడు ముగుస్తుంది?
శాస్త్రవేత్తల తాజా అంచనా ప్రకారం, భూమిపై మొక్కల జీవితం ఇంకా సుమారు 180 కోట్ల సంవత్సరాలు (1.8 బిలియన్ సంవత్సరాలు) కొనసాగవచ్చు.
ఆ తర్వాత భూమిపై పరిస్థితులు మొక్కలు కూడా జీవించలేని స్థాయికి మారే అవకాశం ఉందని తెలిపారు.
దీనికి ప్రధాన కారణం సూర్యుడు క్రమంగా మరింత ప్రకాశవంతంగా, వేడిగా మారుతుండటమేనని వివరించారు.
పరిశోధకుల ప్రకారం, భూమి సముద్రాలు పూర్తిగా ఆవిరైపోయే దశకు చేరుకునే వరకు మొక్కల జీవం కొనసాగే అవకాశం ఉంది.
అయితే ఆ దశకు చాలా ముందే మనుషులు, జంతువులు భూమిపై నుంచి అంతరించే అవకాశముందని పేర్కొన్నారు.
సముద్రాలు అంతరిక్షంలోకి కోల్పోయే సమయానికి భూమి పూర్తిగా నివాసయోగ్యం కాని గ్రహంగా మారుతుందని పరిశోధకులు వెల్లడించారు.
వివరాలు
ఎందుకు ఇలా జరుగుతుంది?
సూర్యుడి వేడి క్రమంగా పెరుగుతుండటంతో భూమి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయి. దాంతో సముద్రాల పరిమాణం తగ్గిపోతుంది.
వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయులు తగ్గడంతో మొక్కలు కిరణజన్య సంయోగక్రియ (ఫోటోసింథసిస్) ద్వారా ఆహారం తయారు చేసుకోవడం కష్టమవుతుంది.
చివరికి తీవ్ర వాతావరణ పరిస్థితులను తట్టుకునే మొక్కలు కూడా మనుగడ సాగించడం కష్టమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వివరాలు
ఈ లెక్కలు ఎలా వేశారు?
అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బోల్డర్ మరియు బ్లూ మార్బుల్ స్పేస్ సంస్థల పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.
ఈ పరిశోధన JGR Atmospheres జర్నల్లో ప్రచురితమైంది. శాస్త్రవేత్తలు అత్యాధునిక త్రిమితీయ (3D) వాతావరణ నమూనాను ఉపయోగించి వచ్చే 200 కోట్ల సంవత్సరాల్లో భూమిపై వాతావరణ పరిస్థితులు ఎలా మారవచ్చో అంచనా వేశారు.
గత అధ్యయనాల మాదిరిగా కేవలం ఉష్ణోగ్రతలనే కాకుండా మేఘాలు, వర్షపాతం, సముద్రాలు, గాలి ప్రవాహాలు వంటి అంశాలను కూడా ఈ నమూనాలో పరిగణనలోకి తీసుకున్నారు.
దీంతో భూమి భవిష్యత్తుపై మరింత సమగ్ర అంచనా వేయగలిగారు.
వివరాలు
ఈ లెక్కలు ఎలా వేశారు?
పరిశోధకులు రెండు ప్రధాన పరిస్థితులను పరిశీలించారు. ఒక దాంట్లో రాళ్లు ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ను గ్రహించడం వల్ల వాతావరణంలో దాని స్థాయులు తగ్గుతాయని భావించారు.
మరో పరిస్థితిలో కార్బన్ డయాక్సైడ్ స్థాయులు పెద్దగా మారకపోయినా, సూర్యుడి వేడి మాత్రం పెరుగుతూనే ఉంటుందని అంచనా వేశారు.
ఈ రెండు పరిస్థితుల్లోనూ మొక్కల జీవితం గత అంచనాల కంటే ఎక్కువ కాలం కొనసాగుతుందనే ఫలితం వచ్చింది.
వివరాలు
చివర వరకు ఏ మొక్కలు బతికే అవకాశం ఉంది?
తీవ్ర ఎండలను తట్టుకునే కాక్టస్ వంటి మొక్కలు,కఠిన వాతావరణానికి అలవాటు పడిన ఇతర వృక్షాలు చివరివరకు మనుగడ సాగించే అవకాశముందని పరిశోధకులు చెబుతున్నారు.
ప్రత్యేకమైన కిరణజన్య సంయోగక్రియ విధానాలు కలిగిన కొన్ని మొక్కలు కూడా ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని వెల్లడించారు.
ఇదే తుది అంచనా కాదా?
శాస్త్రవేత్తలు మాత్రం ఇది తుదినిర్ణయం కాదని స్పష్టం చేస్తున్నారు.కోట్లసంవత్సరాల వ్యవధిలో మొక్కలు ఎలా పరిణామం చెందుతాయో లేదా భవిష్యత్తులో మనుషులు అభివృద్ధి చేసే సాంకేతికత పరిస్థితులను ఎలా మార్చగలదో ఈ అధ్యయనంలో పరిగణనలోకి తీసుకోలేదు.
మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మొక్కలు కొత్తగా అలవాటు పడే అవకాశమూ ఉందని, మరింత ఎత్తైన వాతావరణ పొరల్లో కూడా విస్తరించే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.